Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్/వాషింగ్టన్ : చైనా, అమెరికాల మధ్య రెండు రోజులపాటు జరిగే వాణిజ్యచర్చలు గురువారం ప్రారంభమయ్యాయి. ఆర్థిక మార్కెట్లపై, మొత్తంగా ప్రపంచ వృద్ధి సరళిపై నీలి నీడలు కమ్ముకునేలా చేసిన ఈ వాణిజ్య వివాదానికి పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. చైనాతో వాణిజ్య చర్చలు బాగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లితిజెర్, ఆర్థిక మంత్రి స్టీవెన్ నుచిన్లు బీజింగ్లో చైనా ఆర్థిక సలహాదారు లియూ హెతో సమావేశమయ్యారు. గత నెల్లో వాషింగ్టన్లో జరిగిన చర్చల్లో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి రెండు రోజుల పాటు వీరిక్కడ భేటీ అయ్యారు. కాగా, బుధవారం వైట్హౌస్ వద్ద ట్రంప్ విలేకర్లతో మాట్లాడుతూ, చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి తమ ప్రభుత్వంలో మంచి నైపుణ్యం, ప్రతిభ గల వ్యక్తులు కృషి చేస్తున్నారని చెప్పారు. మార్చి 1వ తేది గడువులోగా ఉభయ పక్షాలు వాణిజ్య టారిఫ్లపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించుకోవాల్సి వుంది. అయితే, ఉభయ పక్షాలు ఒప్పందానికి చేరువలోకి వచ్చినట్లైతే చైనా ఉత్పత్తులపై టారిఫ్లు పెంచడానికి అవసరమైతే గడువును పెంచడానికి తాను సిద్ధంగా వున్నానని ట్రంప్ సూచనప్రాయంగా తెలియచేయడంతో ఒత్తిడి కాస్తంత తగ్గినట్లు కనిపిస్తోంది. చర్చలకు మరింత సమయం ఇస్తూ డిసెంబరులో చైనా దిగుమతులపై టారిఫ్లు పెంచకుండా ట్రంప్ వాయిదా వేశారు. కాగా, ఈవారంలో బీజింగ్లో అమెరికా అధికారులతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశమవుతారని మీడియా వార్తలు వెలువడ్డాయి. ఇదిలావుండగా, చైనాతో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా మేథో సంపత్తి హక్కులకు సంబంధించిన పలు అంశాలను తగు విధంగా పరిష్కరించేలా వుండాలని కోరుతూ ఏడుగురు డెమోక్రాట్లు అధ్యక్షుడు ట్రంప్కు ఒక లేఖ రాశారు. చైనాను జవాబుదారీ చేస్తూ పర్యవేక్షక, అమలు యంత్రాంగం ఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు.