Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికవేత్త క్రుగ్మన్ హెచ్చరిక
దుబాయ్: ఈ ఏడాది లేదా వచ్చే ఏడాదిలో మరోసారి మహా మాంద్యం తలెత్తే అవకాశాలున్నా యని నోబుల్ పురస్కార విజేత, ప్రముఖ ఆర్థిక వేత్త పాల్ క్రుగ్మన్ హెచ్చరించారు. ఆర్థిక విధాన కర్తలలో సన్నద్ధత లోపించ టమే ఇందుకు కారణమని ఇక్కడ జరుగుతున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో స్పష్టం చేశారు. ఏదో ఒక వ్యతిరేకాంశం వల్ల ఆర్థిక తిరోగమనం తలెత్తబోదని, ప్రపం చంలోని వివిధ దేశాలలో తలెత్తుతున్న ఆర్థికపరమైన వత్తిళ్ల వల్ల మాత్రమే తిరోగమనం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితులను గమనిస్తుంటే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాదిలో ప్రపంచంలో మరోసారి మహామాంద్యం తలెత్తే ప్రమాదం వుందన్న భావన కలుగుతోందని ఆయన చెప్పారు. మనకు ఏవైనా తిరోగమన పరిస్థితులు ఎదురైనపుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనే సన్నద్ధత కరువవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మార్కెట్ సంక్షోభ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన విధానాలు, ఆయుధాలు కేంద్ర బ్యాంకుల వద్ద లేకపోవటాన్ని ఆయన ప్రస్తావిస్తూ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళికలను ముందుగా రూపొందించుకుంటే రిస్క్ నామమాత్రంగా వుంటుందని ఆయన సూచించారు. ప్రస్తుతం వివిద దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య పోరు, ఆయా దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలు విధానపరమైన ఎజెండాను తోసిరాజంటున్నాయని, వనరులను వాస్తవ ప్రాధాన్యతలకు వినియోగించే ధోరణి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. స్థంభించిన వేతనాలు, పెరుగుతున్న అసమానతలు, వ్యాపార దిగ్గజాల పట్ల తగ్గుతున్న విశ్వాసం, ప్రజాకర్షక పథకాలు ప్రపంచీకరణ ఆశయాలు, లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయని ఆయన చెప్పారు.