Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 920 మిలియన్ డాలర్ల సాయం కోరిన ఐరాస
న్యూయార్క్: బంగ్లాదేశ్ ఆర్మీ హింసాకాండతో భీతిల్లి ఇతర దేశాలకు వలసవెళ్తున్న రోహింగ్యా శరణార్థులను ఆదుకోవాలని ప్రపంచదేశాలను ఐరాస అభ్యర్థించింది. వీరి సహాయార్థం 920 మిలియన్ డాలర్లు (65,64,66,00,000) అందించాలని ఐరాస కోరింది. మయన్మార్ నుంచి ఇతర దేశాలకు 9లక్షల మంది వలసవెళ్లారని పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది బంగ్లాదేశ్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. ఆహార పదార్థాలు, మందులు, సరైన ఆశ్రయం లేకపోవడంతో వీరంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐరాస తెలిపింది. శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఐరాస హైకమిషన్, అంతర్జాతీయ శరణార్థి సంస్థ ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. ఈ రెండు సంస్థలు శరణార్థులకు సంబంధించి ఓ నివేదికను అందజేశాయని ఐరాస తెలిపింది. దీనిలోని వివరాల ప్రకారం...మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో అక్కడి ఆర్మీ అరాచకాలకు పాల్పడుతున్నది. రోహింగ్యా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోంది. వీరి ఆవాసాలను తగులబెట్టింది. సైనికులు మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను చితకబాదుతున్నారు. ఎదురుతిరిగి ప్రశ్నించిన వారిని కాల్చి చంపుతున్నారు. మయన్మార్ ఆర్మీ ఆగడాలతో భయబ్రాంతులకు గురైన రోహింగ్యన్లు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. 2017, ఆగస్టులో రఖైన్ రాష్ట్రం నుంచి 7,45,000 మంది శరణార్థులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. రోహింగ్యన్ల సమస్యలపై స్పందించడంతో పాటు వీరికి అవసరమైన న్యాయసాయం అందించేందుకు గతనెలలో ఐరాస ప్రత్యేక బృందాలు మయన్మార్కు వెళ్లాయి. హక్కుల కార్యకర్త యాంగీ లీ మయన్మార్లోని రోహింగ్యన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశారు. మయన్మార్ ఆర్మీ చీఫ్ను అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రాసిక్యూట్ చేయాల్సిన అవరసముందని అభిప్రాయపడ్డారు. మయన్మార్లో జరిగిన రోహింగ్యన్ల మరణాలకు ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో ఐరాస ప్రతినిధి, నిజనిర్థారణ కమిటి చీఫ్ మార్జూకీ దారుస్మాన్ మయన్మార్లో పర్యటించారు. 4లక్షల 50వేల మంది రోహింగ్యన్లు ప్రాణభయంతో ఇతర దేశాలకు పారిపోయినట్టు నిర్థారించారు.
తమ పిలుపు మేరకు పలు దేశాలు రోహింగ్యన్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని అన్నారు. రోహింగ్యన్లు వంట చేసుకునేందుకు ఎల్పీజీ గ్యాస్స్టౌలు పంపిణీ చేయాలని భావిస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థన మేరకు గతేడాది ప్రపంచ దేశాలు 655 మిలియన్ డాలర్లు ( 46,38, 07,50,000 ) సాయం అందించాయని దారుస్మాన్ తెలిపారు. ఈ ఏడాది 920 మిలియన్ డాలర్ల (65,64,66, 00,000) ఆర్థికసాయం అవసరమని ఆమె అభ్యర్థిస్తున్నారు.