Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే వేగంతో నశిస్తే.. శతాబ్దంలోపు కీటకాలే మిగలవు
- జీవ చక్రంలో క్రమం తప్పితే మానవులు సహా ప్రాణులన్నింటికీ ముప్పు తప్పదు
- పట్టణీకరణ, రసాయన వినియోగాలు, వాతావరణ మార్పులే ప్రధాన కారణం
న్యూయార్క్ : కంటికి సులువుగా కనిపించే జంతువులు, పశుపక్ష్యాదుల సంఖ్యలో మార్పులను వెంటనే గుర్తించవచ్చు. కానీ, కీటకాలు, పురుగుల విషయంలో అది సాధ్యం కాదు. వాటి మనుగడపై పెద్దగా పట్టింపు ఉండకపోవచ్చు. జీవ చక్రంలో ప్రతి జీవి ముఖ్యమైనదే. ఒక జీవిపై మరొక జీవి ఆధారపడి మనుగడ సాధిస్తుంటాయి. కీటకాలు నశించినా భూగోళంపైనున్న సకల ప్రాణకోటికి ముప్పు తప్పదు. అయితే కీటక జాతులు వేగంగా అంతరిస్తున్నాయని, ఈ అంశంపై మనమందరం వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరముందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే భూగోళంపై నున్న జీవులన్నీ ఉండాల్సిన మోతాదులో ఉండాల్సిందే. జంతువులు, పక్షులు, సరిసృపాలు, ఉభయచరాలు మొదలైనవన్నీ తగిన మొతాదులో ఉండాలి. ఈ జీవచక్రంలో అసమతుల్యత ఏర్పడితే పర్యావరణానికి పెనుముప్పు తప్పదు. కానీ ప్రపంచంలోని 40 శాతం కీటక జాతులు వేగంగా అంతరించిపోతాయని ఓ నివేదిక వెల్లడించింది. మూడోవంతు కీటకాల జాతులు మూడోవంతు అత్యంత ప్రమాదంలో ఉండటం ఇప్పుడు కలవరపరుస్తోంది. క్షీరదాలు, పక్షులు, సరిసృపాలతో పోల్చితే ఎనిమిది రెట్లు వేగంగా కీటకాలు అంతరిస్తున్నాయని వెల్లడించింది. ఏటా 2.5శాతం కీటక జాతులు అంతరించిపోతున్నాయి. ఒకవేళ ఇదిలాగే కొన సాగితే.. భూగోళంపైనున్న సకల ప్రాణకోటికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రకృతిలో సహజసిద్ధంగా ఏర్పడ్డ జీవావరణంలో కీటకాలు కీలకమైనవి. పక్షులు, సరిసౄపాలు, ఉభయచరాలు, చేపలు.. కీటకాలనే ఆహారంగా తీసుకుంటాయి. ఒకవేళ కీటకాలు నశించి పోతే... ఈ జాతులూ ఆకలితో అలమటించి అంతరించిపోతాయి. ఇలా ఈ గొలుసు సాగుతూనే ఉంటుంది. ఇలా జీవరాశులన్నింటి మనుగడకు ప్రతిప్రాణీ కీలకమే. కొన్ని శతాబ్దాలకాలంలో కోట్ల జంతు జాతులు ఉనికిని కోల్పోయాయి. పక్షులు, క్షీరదాల కన్నా కీటక జాతులే వేగంగా అంతరించి పోతున్నాయి. ప్రస్తుతం ఏటా 2.5శాతం కీటక జాతులు అంతరించిపోతున్నాయి. ఒక శతాబ్దకాలంలో కీటకజాతులన్నీ నశించిపోయే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది. ఈ వినాశనాన్ని అడ్డుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
2005 నుంచి గతేడాది వరకు ప్రపంచవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరిన సందర్భాలు 20 రెట్లు పెరిగాయి. ఇటీవల అమెరికాలోని క్యాంప్పైర్లో చెలరేగిన కారుచిచ్చుల వంటివి 7 రెట్లు పెరిగాయి. మానవ తప్పిదాల మూలంగా వచ్చే వందేండ్లలో ప్రపంచంలోని క్రిమికీటకాలన్నీ కనుమరుగైపోయే అవకాశాలున్నాయని అంతర్జాతీయ అధ్యయన సంస్థ హెచ్చరిస్తున్నది. ప్రపంచంలో 41శాతం కీటక జాతులు హరించిపోతు న్నాయి. వాటిలో మనకు బాగా తెలిసిన కీటక జాతులు కూడా ఉన్నాయి. 49 శాతం తుమ్మెద జాతులు అంతరించి పోతున్నాయి. 37 శాతం ఈగ జాతులు కనుమరుగవుతున్నాయి. అలానే 53 శాతం సీతాకోక చిలుక జాతులు, చిమ్మట పురుగుల జాతుల మనుగడ కూడా ప్రమాదంలో పడింది.
అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు :
మన కార్యకలాపాలు, మన ఆహారోత్పత్తి పద్ధతులే వాటి ఉనికికి ప్రమాదంగా మారాయి. భూగ్రహంపైకీటక వైవిధ్యానికి ప్రధానంగా మూడు అంశాలు చేటు చేస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. పారిశ్రామిక యుగం తర్వాత పరిశ్రమలు, సాంకేతికత, ఇతర అధునాతన కార్యక్రమాలను అవలంబిస్తున్న మానవులు పర్యావరణంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. మానవ మనుగడకు పెను సవాలు విసురుతున్న గ్లోబల్ వార్మింగ్ను కట్టడి చేసేందుకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు. భూతాపం పెరగడం వల్ల కీటక జాతులు నశించిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో విచ్చల విడిగా రసాయనాలు వాడటంతో కీటక జాతులు ప్రమాదంలో పడుతున్నాయి. వీటితోపాటు పట్టణీకరణా ప్రధాన కారణంగా నిలుస్తున్నది.