Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనిజులా అధ్యక్షుడు మదురో ఆదేశాలు
కారకస్ : కొలంబియాతో గల సరిహద్దు వద్ద సైనిక బలగాలను శాశ్వతంగా మోహరించేలా ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో సైన్యాన్ని ఆదేశించారు. కవ్వింపు చర్యలను నివారించేందుకు బలగాల మొహరింపు తప్పదని అన్నారు. సురక్షితంగా, ప్రశాంతంగా వుండాలంటే, చొరబాట్లు లేకుండా చూడాలంటే కొలంబియాతో సరిహద్దును బలోపేతం చేయడం అవసరమని మదురో వ్యాఖ్యానించారు. ''మన మాతృభూమిని పరిరక్షించుకోవడానికి, కవ్వింపు చర్యలను తిప్పికొట్టడానికి బలగాలను సన్నద్ధం చేయడం తప్పనిసరని అన్నారు. సైనిక విన్యాసాల ముగింపు సందర్భంగా జరిగిన సమావేశంలో మదురో మాట్లాడారు. బలగాల మోహరింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డుక్యూకు అమెరికా ప్రభుత్వ మద్దతు వుందని, అందువల్ల అటువైపు నుండి వెనిజులాకు ముప్పు వుందని అన్నారు. వెనిజులా సంక్షోభంపై చర్చించేందుకు వాషింగ్టన్ వెళ్ళిన డుక్యూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు గెయిడోకి మద్దతిస్తానని ట్రంప్కు హామీ ఇచ్చి వచ్చారు. వెనిజులాపై దురాక్రమణకు, దాడి, యుద్ధానికి ప్రతిపక్షం అమెరికాను ఆహ్వానిస్తోందని మదురో విమర్శించారు. ఇలా చరిత్రలో ఎన్నడూ జరగలేదని అన్నారు.