Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్పాటువాదులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్
- 2లక్షల మంది పాల్గొన్నట్టు నిర్వాహకుల వెల్లడి
మాడ్రిడ్ : స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో నిరసలు మిన్నంటాయి. కాటలోనియా వేర్పాటువాదులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు, పసుపు, నీలం, ఎరుపు రంగు బ్యానర్లు ప్రదర్శించి నినాదాలు చేశారు. ప్రాంతీయ నేత క్విమ్ టోరా నిరసన కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. ఈర్యాలీలో 2లక్షల మంది పాల్గొన్నారని టోరా అన్నారు. స్పెయిన్ అధికారులు అరెస్ట్ చేసిన నేతలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్పెయిన్ నుంచి కాటలోనియా వైదొలగాలనే డిమాండ్ 2017 నుంచి తెరపైకి వచ్చింది. కాటలోనియా స్వాతంత్య్రం కోసం 12 మంది నేతలు పోరాడి అరెస్ట్ అయ్యారు. ఈకేసు విచారణ ఈనెల 12నుంచి మాడ్రిడ్ సుప్రీంకోర్టులో కొనసాగుతున్నది. 2017,అక్టోబర్లో స్పెయిన్ నుంచి కాటలోనియా వేర్పాటు కోసం వీరంతా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రభుత్వ తిరుగుబాటును స్పెయిన్లో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుకు ఉసిగొల్పిన 12 మంది నేతలపై మోపిన అభియోగాలు రుజువైనట్టయితే 15ఏండ్ల శిక్షపడే అవకాశముంది. మూడు నెలల పాటు వీరిపై విచారణ కొనసాగనుంది. ఈవిచారణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు కదం తొక్కారు.