Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై యువరాజు సల్మాన్ సంతకం
ఇస్లామాబాద్: పాకిస్తాన్కు ఆర్థిక సాయం అందజేయనున్నట్టు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ఆదివారం పాకిస్తాన్కు చేరుకున్న సౌదీ యువరాజుకు ఘన స్వాగతం లభించింది. పాక్కు ఆర్ధికంగా ఊతమిచ్చేలా సౌదీ అరేబియా 20 బిలియన్ డాలర్ల విలువైన ఓ భారీ ఒప్పందంపై సంతకాలు చేసింది. రిఫైనింగ్, పెట్రో కెమికల్ రంగాలు సహా క్రీడారంగంలో సహకారం, సౌదీ వస్తువుల దిగుమతి, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, ఇంధన ప్రాజెక్టులు సహా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ పాక్తో ఒప్పందాలు కుదుర్చుకుంది. తమ సోదర దేశమైన పాకిస్తాన్ ఆర్ధిక భవిషత్తు తమకు చాలా ముఖ్యమని ఈ సందర్భంగా సల్మాన్ పేర్కొన్నారు. అయితే, సౌదీ రాజు తన పర్యటనలో భాగంగా ఇండోనేసియా, మలేషియా కూడా వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం ఆ దేశాలకు వెళ్లేందుకు ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం.
పాక్ ఖైదీల విడుదలకు ఆదేశాలు
సౌదీ జైళ్లలో మగ్గుతున్న 2,107 మంది ఖైదీల విడుదలకు సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. సౌదీ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న తమ పౌరులను విడుదల చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన విజ్ఞాపనపై సల్మాన్ సానుకూలంగా స్పందించారు. సౌదీలో బంధీలుగా ఉన్న తమ దేశీయల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి, సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సౌదీ యువరాజుకు పాక్ అత్యున్నత పురస్కారం
ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన పాక్ను గట్టెక్కిచ్చినందుకు సల్మాన్కు అవార్డు ప్రదానం చేయాలని పాకిస్తాన్ నిర్ణయించుకుంది. ఏకంగా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఆయన పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనేపథ్యంలో సల్మాన్కు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఎ-పాకిస్తాన్ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించుకుంది. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ చేతుల మీదుగా సల్మాన్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. సల్మాన్ భారత్, చైనా దేశాల్లో పర్యటించనున్నారు.