Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంకారా : సైనిక తిరుగుబాటు ఆరోపణలపై 281 మందిని అరెస్ట్ చేసినట్టు టర్కీ ప్రకటించింది. టర్కీలో 2016లో సైనిక తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ఎర్డోగన్ను గద్దె దించాలని సైనికుల్లోని ఓ వర్గం తిరుగుబాటుకు తెరలేపింది. అయితే, ఈ తిరుగు బాటును అణిచివేయాల్సిందిగా ఎర్డోగన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో, ప్రజలు వీధుల్లోకి చేరుకొని సైనికులను చితకబాదారు. ఎర్డోగన్కు మద్దతుగా నిలిచారు. సైనిక తిరుగుబాటు కారణంగా చెలరేగిన అల్లర్లలో 250 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ తిరుగుబాటు వెనుక అమెరికాలోని పెన్సిల్వేనియా నగరంలో ప్రవాసముంటున్న ఫెతుల్లా గులెన్ హస్తముందని ఎర్డోగన్ అనుమానిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సైనిక తిరుగుబాటుకు కుట్ర పన్నిన ఆరోపణలపై న్యాయమూర్తులను, సైనికాధికారులను, పోలీస్ ఉన్నతాధికారులను, పలు వర్సిటీల వీసీలను, లెక్చరర్లలను, సైనికులను, డాక్లర్లను, ప్రభుత్వ ఉద్యోగులను అంకారా ప్రత్యేక బలగాలు అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి 70వేల మందికి పైగా అరెస్టయ్యారు. తాజాగా, ఇజ్మిర్ ప్రావిన్స్లో అంకారా ప్రత్యేక బలగాలు దాడులు నిర్వహించి 281 మందిని అరెస్ట్ చేశాయి.