Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాలకు వెళ్తున్న వారిలో భారత్ నుంచి అధికం
- వలసదారుల జనాభాలో అగ్రస్థానంలో అమెరికా : ఐరాస
న్యూయార్క్ : సాంకేతికాభివృద్ధి రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస, మెరుగైన ఉపాధి, అవకాశాలు చేజిక్కించుకోవాలనే ధృడ సంకల్పంతో నేటి యువత వలస బాట పట్టేందుకు సుముఖత చూపుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో విద్యను అభ్యసించి అక్కడే ఉపాధి అవకాశాలు పొందాలని చాలా మంది యువత ఉవ్విళ్లూరుతున్నారు. స్వదేశీ విద్య, ఉపాధి కంటే విదేశీ విద్య, ఉపాధి అవకాశాల వైపు ఆకర్షితులవుతున్నారు. అన్ని దేశాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటంతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. ఒక దేశం నుంచి మరోదేశానికి వలసలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కానీ భారత్లో మాత్రం మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో విజ్ఞానవంతుల్ని భారత్కు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చకపోవడంతో అత్యధికంగా విదేశాల బాట పట్టారు
వలసవెళ్తున్న వారి సంఖ్య భారత్ నుంచి అధికంగా ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వలసదారుల జనాభాలో అమెరికా తొలిస్థానంలో ఉన్నదని తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. దీనిలోని వివరాల ప్రకారం... వలసదారుల సంఖ్య పలు దేశాల్లో గణనీయంగా పెరుగుతూ ఉండగా, పలు చోట్ల వలసలు తగ్గుముఖం పడుతున్నాయి. వలసదారుల నియంత్రణ కోసం పలు దేశాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో భద్రతా బలగాలతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నాయి. భద్రతా బలగాలు వలసదారుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి. ధ్రువీకరణ పత్రాల తనిఖీల పేరుతో వలసదారులను వేధిస్తున్నాయి. అంతర్యుద్ధాల కారణంగా, ఉపాధి అవకాశాల అన్వేషణలో వలసవస్తున్నవారిని అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 2015లో అమెరికాకు వలసల తాకిడీ అధికంగా ఉందని ఐరాస పేర్కొంది. 2015లో అమెరికాలో 4కోట్ల 80లక్షల మంది వలసదారులు ( అమెరికాలో జన్మించినవారి జనాభాతో కలిపి ) ఉన్నారని తెలిపింది. సౌదీ అరేబియాలో 11 మిలియన్ల మంది, కెనడాలో 7.6 మిలియన్ల మంది వలసదారులు ఉన్నారు. చమురు నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని ఐరాస అభిప్రాయపడింది. చముదరు సమృద్ధిగా ఉండి వలసదారుల సంఖ్య అధికంగా ఉన్న దేశాలను ఐరాస మొదటి గ్రూపులో చేర్చింది. ఉపాధి అవకాశాల కోసం యువత అరబ్బు దేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారని తెలిపింది. 2015లో యూఏఈలో 87శాతం, కువైట్లో 73శాతం, ఖతార్లో 68శాతం, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో 34 శాతం నుంచి 51 శాతం మంది వలసదారులు ఉండేవారని తెలిపింది. రెండో గ్రూపులో మాకోలో (57 శాతం), మొనాకోలో ( 55 శాతం), సింగపూర్ (46 శాతం) దేశాలను చేర్చింది. మూడో గ్రూపులో ఆస్ట్రేలియాలో 28శాతం, కెనడాలో 21 శాతం మంది వలసదారులు నివసిస్తున్నారని తెలిపింది. నాలుగో గ్రూపులో పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలు మెరుగైన దేశాలను చేర్చింది. ఈ గ్రూపులో ఆస్ట్రియా (28శాతం), స్వీడన్ (16శాతం), యూఎస్( 15శాతం), బ్రిటన్ (13శాతం), స్పెయిన్(13శాతం), జర్మనీ (12శాతం), ఫ్రాన్స్ (12శాతం), నెదర్లాండ్ (12శాతం), బెల్జియం (11 శాతం), ఇటలీ ( 10శాతం) దేశాలను చేర్చింది. ఐదో గ్రూపులో అంతర్యుద్ధాల కారణంగా వలసదారుల సంఖ్య పెరిగిన దేశాలను చేర్చింది. 2011లో సిరియాలో అంతర్యుద్ధం సంభవించింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పులు, దాడుల కారణంగా భయాందోళనలకు గురై లక్షలాది మంది శరణార్థులుగా మారారు. 2015లో యుద్ధ వాతావరణం కారణంగా సిరియా, ఇరాక్ దేశాల నుంచి లెబనాన్కు వలసలు భారీగా పెరిగాయి. లెబనాన్ జనాభాలో 20శాతం మంది వలసదారులే ఉన్నారని ఐరాస తేల్చి చెప్పింది.సూడాన్ నుంచి వలసవచ్చిన 40శాతం మంది ఛాడ్లో నివసిస్తున్నారని తెలిపింది. వలసవెళ్తున్న వారి సంఖ్య భారత్ నుంచే అత్యధికంగా ఉన్నదని ఐరాస నివేదికలో పేర్కొంది. 2015 గణాంకాల ప్రకారం...భారత్ నుంచి ఇతర ప్రాంతాలకు 16లక్షల మంది వలసవెళ్లినట్టు తెలిపింది. మెక్సికో నుంచి 12 లక్షల మంది వలసవెళ్లారని తెలిపింది. బోస్నియా, హెర్జెగోవినా దేశాల్లో ప్రతీ ముగ్గురిలో ఒక్కరు విదేశాల్లో నివసిస్తున్నారని ఐరాస తెలిపింది. ఈ రెండు దేశాల జనాభాల్లో 33 శాతం మంది విదేశాల్లో ప్రవాసముంటున్నారని తెలిపింది. పలు దేశాల్లో వలసదారులు, ప్రవాసులు ఉన్నారు. 2015లో 84లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి బ్రిటన్కు వలసవచ్చారు. అదే ఏడాదిలో 47లక్షల మంది ఇతరదేశాలకు వలసవెళ్లారు. పలు దేశాలు వలసదారులను అనుమతించడంలేదు. ఇతర ప్రాంతాలకు వలసవెళ్లేందుకు కూడా అనుమతించడంలేదు. జపాన్లో వలసదారుల సంఖ్య తక్కువగా ఉన్నది. 2015లో జపాన్కు 1.7శాతం మంది మాత్రమే వలసదారులు వచ్చినట్టు ఐరాస పేర్కొంది. జపాన్ నుంచి ఇతర దేశాలకు 0.6శాతం మంది వలసవెళ్లారని తెలిపింది.
2017లో ప్రపంచ వ్యాప్తంగా 258 మిలియన్ల మంది వలసదారులను గుర్తించినట్టు తెలిపింది. ప్రపంచ జనాభాలో వలసదారుల సంఖ్య 3.4శాతం మాత్రమే. పలు దశాబ్దాల నుంచి వలసదారుల జనాభా పెరుగుతున్నది. 1990లో 2.9శాతం మంది. 1965లో 2.3 శాతం మంది వలసదారులు ఉండేవారు.