Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు 140వ స్థానం
- మనకన్నా మెరుగ్గా పాకిస్తానీయులు
వాషింగ్టన్ : భారతీయుల కంటే పాకిస్తాన్ ప్రజలే సంతోషంగా ఉన్నారని 'ఐరాస వరల్డ్ హ్యాపీనెస్' తాజా నివేదిక తేల్చింది. గతేడాది (2018)తో పోల్చితే 'హ్యాపీనెస్' ర్యాంకింగ్లో భారత్ 7స్థానాలు దిగజారి 140వ స్థానంలో నిలిచింది. భారత్తో పోల్చితే అనేక విషయాల్లో పాకిస్తాన్ ప్రజలు ఆనందంగా ఉన్నారని నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదికలో పాకిస్తాన్కు 67వ స్థానం దక్కింది. ఐక్యరాజ్యసమితి తరఫున 'సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్' ఈ నివేదికను రూపొందించింది. మార్చి 20 'వరల్డ్ హ్యాపీనెస్ డే' సందర్భంగా ఈ నివేదికను ఐరాసలో విడుదల చేశారు.
ఆదాయం, స్వేచ్ఛ, నమ్మకం, ఆరోగ్యకర జీవన ప్రమాణాలు, సామాజిక మద్దతు, ఉదారత వంటి 6 కీలక అంశాల ప్రాతిపదికన ఈ జాబితాను సిద్ధం చేశారు. 156దేశాల్లో అధ్యయనం చేశారు. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో సంతోషంపాలు తగ్గింది. అనేకమందిలో 'వ్యతిరేక ఆలోచనలు', కోపం, విచారం పెరిగిపోయాయి. యుద్ధాలు, రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధంతో అల్లాడుతున్న దక్షిణ సూడాన్(156) ప్రజలు సంతోషకరమైన జీవితాలకు దూరమయ్యారు. ఆ తర్వాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్(155), ఆఫ్ఘనిస్తాన్(154), టాంజానియా(153), రువాండా(152) దేశాలున్నాయి.
అగ్రస్థానంలో ఫిన్లాండ్
'హ్యాపీనెస్' జాబితాలో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుఖమయ జీవనానికి ఆవాసంగా ఫిన్లాండ్కు ఐరాస నివేదిక పట్టం కట్టింది. ఆ తర్వాత స్థానాల్లో డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, నెదర్లాండ్స్ నిలిచాయి. ఈ జాబితాలో చైనా (93వ స్థానం), బంగ్లాదేశ్(125వ స్థానం) దేశాలు మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన అమెరికాకు 19వ ర్యాంక్ దక్కింది.