Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 94 మంది మృతి
- టైగ్రిస్ నదిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
బాగ్దాద్: ఇరాక్లోని టైగ్రిస్ నదిలో ఓ పర్యాటక పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో 94 మంది మృతిచెందారు. మృతుల్లో 61 మంది మహిళలు, 19 మంది చిన్నారులు ఉన్నారు. మరికొందరు గల్లంతయ్యారు. నౌక ప్రమాదానికి గురైన సమయంలో 200 మంది ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. 55 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...మోసుల్ నగరంలో టైగ్రిస్ నదిలో ప్రయాణిస్తున్న ఆ పడవ నీట మునిగిన ఘటనలో 94 మంది మృతిచెందారు. పడవలో మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం ఓ దీవికి ఆ పడవలో దాదాపు 200 మంది ప్రయాణికులు బయలుదేరారని అధికారులు తెలిపారు. పడవలో ప్రయాణిస్తున్న వారిలో చాలా మందికి ఈత రాకపోవడంతో జలసమాధయ్యారని మోసుల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది.
'కుర్దిష్ న్యూ ఇయర్గా జరుపుకునే నౌరుజ్ పండుగ నేపథ్యంలో 200 మంది పర్యాటకులు నదికి ఆవలి వైపు ఉన్న ఉమ్ రుబేయిన్ ద్వీపానికి ఓ పడవలో బయలుదేరారు. ప్రమాదవశాత్తు పడవ నీటిలో మునిగి 94 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తాం. ఇరాక్లో జరిగిన విషాదకరమైన ఘటనల్లో ఇది ఒకటి' అని ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దెల్ మహ్దీ పేర్కొన్నారు. ఇరాక్లో మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు.
టైగ్రిస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటం, పరిమితికి మించి ప్రయాణికులు పడవలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మోసుల్ డ్యామ్ గేట్లు తెరవడంతో నదిలో ఉధృతి పెరిగింది. వేగంగా ప్రవహిస్తున్న నదిలో ఈ పడవ మొదట కుడివైపుకు ఒరిగిపోవడంతో నీళ్ళు లోపలికి వచ్చి మునిగిపోయినట్టు వీడియో ఫుటేజి ద్వారా అర్థమవుతుంది.
ఆ తర్వాత నదీ ప్రవాహంలో పడవ కొట్టుకుపోయిందని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. సహాయక చర్యలు చేపట్టడానికి అంబులెన్సులు, హెలికాప్టర్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రాణాలతో ఉన్న వారిని తీరం చేర్చే ప్రయత్నాలతో పాటు మృతదేహాలను వెతికితీసే పనులను ముమ్మరం చేశారు.
మోసుల్ డ్యామ్ గేట్లు తెరిచినందున ప్రవాహ ఉదృతి, నీటి మట్టం పెరుగుతుందని అధికారులు అంతకు ముందే హెచ్చరికలు జారీ చేసినట్టు చెబుతున్నారు. అయితే, పడవ నిర్వాహకులు ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని కొందరు ఆరోపిస్తున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రయాణీకుల మృతికి బాధ్యులైన 9 మంది పడవ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఇరాక్ ప్రభుత్వం ఆదేశించింది. క్షతగాత్రులకు సంపూర్ణ చికిత్స అందజేస్తామని భరోసా ఇచ్చింది. పడవ ప్రమాద ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.