Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సామాజిక మాధ్యమాలకు అమెరికా యువత బానిస
-60 శాతం నుంచి 16శాతానికి తగ్గిన పుస్తక పఠనం
- యూఎన్ వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్
వాషింగ్టన్ :సామాజిక మాధ్యమాలకు బానిసలైన యువత, విద్యార్థులు పుస్తక పఠనానికి క్రమక్రమంగా దూరమవుతున్నారు. ప్రతీ అంశాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనే అన్వేషించే అలవాటు చేసుకుంటున్నారు. గతంలో ఏదైనా ఓ అంశానికి సంబంధించిన సమాచారం కోసం అనేక పుస్తకాలు తిరిగేసే యువత క్రమక్రమంగా వెబ్సైట్లలో ఇన్ఫర్మేషన్ కోసం శోధించడం ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల కారణంగా ఒంటరితనానికి అలవాటుపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపే మధుర క్షణాలను కోల్పోతున్నారు. అసంతృత్తితో జీవిస్తూ..అనవసర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు సన్నిహితులతో, కుటుంబ సభ్యులతోనే పంచుకునే యువత తమలో తాము బాధను దిగమింగుకునేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సరైన మార్గదర్శకత్వం, సలహాలు లభించకపోవడంతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడున్నారు. సామాజిక మాధ్యమాల కారణంగా మెజారిటీ అమెరికన్లు అసంతృప్తికి లోనవుతున్నారని అమెరికాకు చెందిన 'యూఎన్ వరల్డ్ హ్యాపినెస్' సంస్థ తాజా సర్వేలో వెల్లడైంది.
సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. ప్రస్తుత సాంకేతిక యుగంలో యువత సోషల్ మీడియా వైపునకు ఆకర్షితులవుతున్నది. సామాజిక మాధ్యమాలకు అమెరికా యువత బానిసగా మారిపోయిందని 'యూఎన్ వరల్డ్ హ్యాపినెస్' రిపోర్ట్ వెల్లడించింది. అంతేగాకుండా, సామాజిక మాధ్యమాలకు బానిసలవుతున్న యువత అసంతృప్తితో జీవిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచ దేశాల్లో అసంతృప్తితో జీవిస్తున్న దేశాల్లో అమెరికా 19వ స్థానంలో ఉందని పేర్కొంది. యూఎన్ వరల్డ్ హ్యాపినెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...అమెరికా యువత సామాజిక మాధ్యమాలకు బానిసలై దుర్భర జీవనం గడుపుతున్నారు. వీరిలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. మాదక ద్రవ్యాల వినియోగం, మద్యం, జూదం వంటి దుర్వసనాలతో సమానంగా యువత సోషల్ మీడియాకు బానిస కావడం పట్ల యూఎన్ వరల్డ్ హ్యాపినెస్ సంస్థ ఆందోళన వ్యక్త చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్లలో సందేశాలు పంపించుకోవడం, యూట్యూబ్ వీక్షించడంలోనే యువత అధికం సమయం కేటాయించడం పట్ల సర్వే నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1991 నుంచి 2011 వరకు సుఖప్రదమైన జీవనాన్ని కొనసాగించిన అమెరికన్ల సంఖ్య అధికంగా ఉండేది. అయితే, 2012 నుంచి వీరి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సామాజిక మాధ్యమాల కారణంగా యువత అసంతృప్తితో జీవిస్తున్నారని యూఎన్ వరల్డ్ హ్యాపినెస్ సంస్థ పేర్కొంది. విరామ సమయాల్లోనూ యువత ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో నిమగమయ్యేందుకు ఆసక్తి కనబర్చడం శోచనీయమని ప్రముఖ అమెరికన్ స్కాలర్ జీన్ ఎం. ట్వేంగే అభిప్రాయపడ్డారు. 2017లో ఇంటర్స్థాయి విద్యార్ధులు సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపించుకోవడం కోసం దాదాపు ఆరు గంటలపాటు సమయాన్ని వృథా చేశారని అన్నారు.
యువత తాము నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన కోసం కృషి చేయాల్సిన దశలో సామాజిక మాధ్యమాల కారణంగా చితికిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 45శాతం మంది మైనర్లు సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నిమగమై పుస్తక పఠనాల నుంచి పూర్తిగా దూరమయ్యారని తాజా సర్వేలో వెల్లడించింది. సామాజిక మాధ్యమాల వ్యసనం కారణంగా కొన్ని దశల్లో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పరస్పరం ఒకరినొకరు చూసుకోకుండా గడపారని ఆ సంస్థ తెలిపింది.
సామాజిక మాధ్యమాలకు బానిసలైన యువత పఠనానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రకృతితో మమేకం కాలేకపోతున్నారు. నిద్ర సరిగ్గా లేకపోవడం, సమయానికి ఆహారం భుజించకపోవడంతో నీరసపడుతుంటారు. పలు సందర్భాల్లో అనారోగ్యాల బారినపడి అసంతృప్తితో జీవిస్తుంటారని యూఎన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ పేర్కొంది. 8 నుంచి 12 ఏండ్లలోపు చిన్నారులు ఫేస్బుక్లో నిమగం కావడంతో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడిపే బాలికలు లేదా మహిళలు త్వరగా చిరాకుపొందుతారని మరో సర్వే వెల్లడించింది. అమెరికాలో 10ఏండ్ల కిందట పుస్తక పఠనం పట్ల 60శాతం మందిలో అలవాటు ఉండేది. క్రమక్రమంగా పుస్తకాలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తున్నది. పుస్తక పఠనం అలవాటు ఉన్నవారు 16శాతానికి పడిపోవడం పట్ల యూఎన్ వరల్డ్ హ్యాపినెస్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాలను అవసరమైన సమాచారం కోసమే ఉపయోగించుకోవాలని సర్వే నిర్వాహకులు కోరారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోనే నిమగమయ్యేవారిలో అసంతృప్తి పెరిగిపోయే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.