Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసాంజే అరెస్ట్ అయ్యాక..:ఈక్వెడార్ వెల్లడి
క్విటో : లండన్లోని తమ దౌత్య కార్యాలయంలో ప్రవాస జీవితం గడుపుతున్న వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేను బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన తరువాత తమ ప్రభుత్వ వ్యవస్థలపై దాదాపు నాలుగు కోట్లకు పైగా సైబర్ దాడులు జరిగాయని ఈక్వెడార్ ప్రభుత్వం వెల్లడించింది. ఈక్వెడార్ సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ మంత్రి పాట్రికో రియల్ సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ దాడులు ప్రధానంగా అమెరికా, బ్రెజిల్, జర్మనీ, రుమేనియా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, బ్రిటన్ తదితర దేశాలతో పాటు తమ దేశం నుంచి కూడా జరిగాయని చెప్పారు. ఈక్వెడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో అసాంజే దౌత్యపరమైన రక్షణను, ఆయన పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్న తరువాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అసాంజే సారథ్యంలోని గ్రూపుల బెదిరింపులతో పాటు ఆయన అరెస్ట్ అనంతరం తమ ప్రభుత్వ వ్యవస్థలపై వెల్లువెత్తిన దాడులతో ఇంటర్నెట్ స్థంభించిందనీ ఈక్వెడార్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ జేవియర్ జారా చెప్పారు. ప్రధానంగా తమ దేశ విదేశాంగశాఖ, కేంద్ర బ్యాంకు, దేశాధ్యక్షుడి కార్యాలయం, ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్తో పాటు పలు మంత్రిత్వశాఖలు, యూనివర్సిటీలకు ఈ దాడుల దెబ్బ గట్టిగా తగిలిందని ఆయన వివరించారు. అయితే ఈ వ్యవస్థల్లో ఎక్కడా సమాచారచౌర్యం కానీ, సమాచార ధ్వంసం కానీ జరిగినట్టు వార్తలందలేదని ఆయన తెలిపారు.