Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించిన ఎలక్షన్ కమిషన్
- బ్యాలెట్ విధానంలో ఓటింగ్
- 6 గంటల్లోనే ప్రాథమిక ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
జకార్త : ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో ఒకటైన ఇండోనేషియా ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రారంభ మైంది. అధ్యక్ష పీఠం మొదలుకుని స్థానిక సంస్థల వరకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ కోసం ఎనిమిది లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటర్లకు సాయంత్రం వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్టు ఇండోనేషియా ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 20 లక్షల మంది మిలిటరీ, పోలీసు లను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో ఉడో, భార్య ఇరియానా జకార్తాలోని పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. జోకో ఉడోకు, మాజీ ఆర్మీ జనరల్, ప్రత్యర్థి ప్రబోవో సుబియాంటోకు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే రిగ్గింగ్ ఆరోపణలు దుమారం రేపాయి. గతవారం మలేసియాలో ఓ గోదాం దగ్గర వేలాదిమంది బ్యాలెట్ పత్రాలు పట్టుకుని బారులు తీరినట్టు కనిపిస్తున్న ఓ వీడియో బయటకు రావడంతో దానిపై ఇండోనేషియా ఎన్నికల సంఘం దర్యాప్తు చేపట్టింది. ఆ గోదాం దగ్గర ఉన్నవారిలో ఎక్కువ శాతం ప్రస్తుత అధ్యక్షు డు జోకో విడోడోకు అనుకూలంగా బ్యాలెట్ పత్రాలపై మార్కు చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మలేషియాలో దాదాపు పది లక్షల మంది ఇండోనేషియన్ ఓటర్లు ఉంటా రని అంచనా. దేశ అధ్యక్ష పదవి, పార్లమెంటు, స్థానిక సంస్థ లన్నింటికీ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చడం ఇండో నేషియా చరిత్రలో ఇదే తొలిసారి. అధ్యక్ష ఎన్ని కల్లో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో ముందంజలో ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్ ముగియగానే రెండు గంటల్లో ప్రాథమిక ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
అయితే, తుది ఫలితాలను మాత్రం ఎన్నికల సంఘం మే నెలలో వెల్లడించనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి అబివృద్ధి, అవినీతి, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇక్కడి ప్రధానమైన సమస్యల్లో జాతీయ గుర్తింపు ఒకటి. ఇండోనేషియా జనాభాలో 80 శాతం మంది ముస్లింలే. ఇక్కడ దేశ అధికారిక మతం అన్నది ఏదీ లేదు. ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఇక్కడ దాదాపు 26 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారు. ఇండోనేషియాలోని దీవుల సంఖ్య 17వేలు. ఈ ఎన్నికల్లో 19.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశ ముంది. 20వేల సీట్ల కోసం 2.45 లక్షల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణ కోసం 8లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.