Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో దుండగులు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బస్సులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది ప్రయాణీకులు మృతిచెందారు. మరో ఇద్దరు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బలూచిస్థాన్ ఇన్స్పెక్టర్ జనరల్ మొహసీన్ హసన్ బట్ తెలిపిన వివరాల ప్రకారం...గురువారం బలూచిస్థాన్ పరిధిలోని మక్రాన్- కోసా జాతీయ రహదారిపై దుండగులు బీభత్సం సృష్టించారు. కరాచీ-గ్వాదర్ నగరాల మధ్య రాకపోకలను కాసేపు స్తంభింపచేశారు. పారామిలిటరీ బలగాల దుస్తుల్లో వచ్చిన దుండగులు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను కిందకి దింపి ఐడెంటీ కార్డులను తనిఖీలు చేశారు. అనంతరం పలువురు ప్రయాణీకులపై కాల్పులకు పాల్పడ్డారు. దుండగుల కాల్పుల్లో 14 మంది మృతిచెందారు. ఈ దాడికి పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఇది కచ్చితంగా తాలిబన్ల పనేనని ఐజీ అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు ప్రయాణికుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత వారం బలోచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 20మంది మృతిచెందిన విషయం విదితమే.