Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైమానిక స్థావరంలో ప్రమాదకర రసాయనం నిల్వ: రహస్యంగా తొలగింపు ప్రక్రియ
వాషింగ్టన్ : వియత్నాం యుద్ధంలో అమెరికా చేసిన విషపు ఆలోచన తాజాగా ఒకటి బయటపడింది. వియత్నాంలోని అమెరికా వైమానిక స్థావరం వద్ద పెద్ద మొత్తంలో దాచిపెట్టిన విష రసాయానం 'ఏజెంట్ ఆరెంజ్'. ఈ విష రసాయనాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియను అమెరికా అత్యంత రహస్యంగా నిర్వహించింది. ఇందుకోసంగాను 183 మిలియన్ డాలర్లను అమెరికా రక్షణ శాఖ ఖర్చుచేసినట్టు తెలిసింది. 'హోచిమిన్' నగర శివారులో ఉన్న 'బైన్ హో' విమాశ్రయం వద్ద 'ఏజెంట్ ఆరెంజ్' విష రసాయనాన్ని అమెరికా పెద్ద ఎత్తున నిల్వచేసింది.
వియత్నాం యుద్ధ సమయంలో ఈ విష రసాయాన్ని అడవులపై, కొండ ప్రాంతాలపై అమెరికా సైన్యం ప్రయోగించింది. 1962-71 మధ్య దక్షిణ వియత్నాంలో 8కోట్ల లీటర్ల 'ఏజెంట్ ఆరెంజ్'ను అమెరికా సైన్యం వెదజల్లింది. ఆ అడవుల్లో దాక్కున్నవారిని చంపటం కోసమే ఆనాడు ఈ విష రసాయాన్ని అమెరికా సైన్యం వెదజల్లింది. ఈ చుట్టుపక్కల జన్యు సంబంధ సమస్యలతో పుడుతున్న శిశువుల సంఖ్య పెరగడంతో అమెరికా విష ప్రయోగం బయటకు పొక్కింది. రసాయన ప్రభావానికి లోనైన తమ సైనికులకు అమెరికా నష్టపరిహారాన్ని చెల్లించింది. కానీ క్యాన్సర్ బారిన పడిన లక్షలాది మంది వియత్నాం ప్రజలకు ఒక్క డాలర్ నష్టపరిహారాన్ని అమెరికా ఇవ్వలేదు.
అడవులపై ప్రయోగించిన ఈ విష రసాయనం అనంతర కాలంలో అక్కడి భూమిలో, నదుల్లో కలిసింది. తద్వారా లక్షాలాది మంది వియత్నాం ప్రజలపై 'ఏజెంట్ ఆరెంజ్' ప్రభావం చూపింది. లక్షా 50వేల మంది చిన్నారులు జన్యు సంబంద సమస్యలతో జన్మించారు. 'బైన్ హో' వైమానిక స్థావరంలో విష రసాయన ప్రభావం నాలుగురేట్లు పెరిగింది. దీంతో గత ఏడాది నవంబర్ నుంచి 'ఏజెంట్ ఆరెంజ్'ను నిర్వీర్యం చేసే ప్రక్రియను అత్యంత రహస్యంగా అమెరికా చేపట్టాల్సి వచ్చింది.