Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : ఇరాన్ సరిహద్దులో అమెరికా బలగాలను మోహరించలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మధ్య ప్రాఛ్య దేశాలకు లక్షా 20 వేల మంది సైనికులను అమెరికా పంపాలని యోచిస్తోందని, ఈమేరకు యూఎస్ రక్షణశాఖ మంత్రి, కీలక సైనికాధికారులతో ట్రంప్ రహస్య భేటీ నిర్వహించినట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించారు. ' ఇతర దేశాలపై దురాక్రమణకు పాల్పడాల్సిన అవసరం, ఇలాంటి దురుద్దేశం అమెరికాకు లేదు. ఒకవేళ ఇరాన్తో యుద్ధమే అనివార్యమైనట్టయితే లక్షా20వేల మందికి రెట్టింపు సైన్యాన్ని బరిలో దింపుతాం. పలు మీడియా సంస్థలు తమ ప్రభుత్వంపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడటమే కాకుండా, తప్పుడు కథనాలు ప్రచురించి బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. మధ్య ప్రాఛ్య దేశాలకు బలగాలను పంపించే అంశంపై యూఎస్ రక్షణ మంత్రి పాట్రిక్ షానహాన్ తనతో ఎలాంటి చర్చలు జరపలేదు. ప్రజలు సంయమనం పాటించాలి. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశంతో పలు మీడియాసంస్థలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అని ట్రంప్ అన్నారు.