Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీన్కార్డుల జారీపై అమెరికా నిర్ణయం
- ఐటీ నిపుణులకు మేలు
- రోజ్గార్డెన్లో ట్రంప్ ప్రకటన చేస్తారని వైట్హౌస్ వెల్లడి
వాషింగ్టన్ : అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణులకు ట్రంప్ సర్కార్ తీపు కబురు అందించనుంది. గ్రీన్కార్డుల జారీలో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని మార్చి దాని స్థానంలో ప్రతిభావంతులకే మేలు చేకూర్చేలా నిబంధనలు చేర్చాలని భావిస్తోంది. ఈ విషయమై త్వరలో రోజ్గార్డెన్లో అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేస్తారని వైట్హౌస్ పేర్కొంది. ట్రంప్ సలహాదారు, అల్లుడు జారెడ్ కుష్నర్ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఈ విధానం ప్రకారం నూరు శాతం గ్రీన్ కార్డులు నైపుణ్యం ఆధారంగానే ఇవ్వనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 66 శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12 శాతం గ్రీన్కార్డులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త విధానం అమల్లోకి వచ్చినట్టయితే భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవారు, అక్కడి హెచ్1బీ వీసాలపై ఉన్నవారికి త్వరితగతిన గ్రీన్కార్డులు లభించే అవకాశం దక్కనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ప్రతీఏటా 11లక్షల గ్రీన్కార్డులు జారీ చేస్తుంది. కాగా, హెచ్1బీ వీసా పొంది దశాబ్ద కాలంగా గ్రీన్కార్డుల కోసం ఎదురు చూస్తున్న వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు ఇది ప్రయోజనం చేకూర్చనుంది. అదేవిధంగా అమెరికా సాంకేతిక అవసరాలను తీర్చే వారికి గ్రీన్కార్డుల జారీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలిసింది.