Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుకూలంగా 222 ఓట్లు, వ్యతిరేకంగా 64
ఏథెన్స్:మూడో బెయిలవుట్ ప్రణాళికకు గ్రీస్ పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. గురువారం రాత్రి నుంచీ సుదీర్ఘ చర్చ అనంతరం పార్లమెంట్లోని మెజారిటీ సభ్యులు రుణదాతల ఉద్దీపనకు ఆమోదం తెలిపారు. 300మంది సభ్యుల పార్లమెంట్లో ఉద్దీపనకు అనుకూలంగా 222 ఎంపీలు ఓటేయగా, 64మంది వ్యతిరేకించారు.
ఐతే, వ్యతిరేకించినవారిలో సొంత పార్టీ సిరిజాకు చెందినవారు 40మంది ఉండటం ప్రధాని సిప్రాస్కు మింగుడుపడని విషయం. సమావేశానికి ముందు జర్మనీ నిబంధనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ఆర్థిక మంత్రులు గ్రీస్కు సూచించారు. ఐతే, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ మాత్రం జర్మనీ సూచనలను తిరస్కరించాలని ఈయు మంత్రులను కోరారు. ఈయు ఆర్థిక మంత్రులు సానుకూలంగా స్పందించి బెయిలవుట్కు ఆమోదిస్తే తాత్కాలికంగా గ్రీస్ ఆర్థిక సంక్షోభానికి తెరపడుతుందని భావిస్తున్నారు. మూడో ఉద్దీపన ద్వారా గ్రీస్కు మూడేళ్లలో రుణదాతల నుంచి 85 బిలియన్ యూరోల (రూ.5.50 లక్షల కోట్లు) అప్పు లభిస్తుంది. ఐతే,గ్రీస్ ఇప్పటికే ఈయు విధించిన షరతులకు ఆమోదం తెలిపిన ప్రకారం పన్నులు పెంచడం, పెన్షన్లను తగ్గించడంవంటి పొదుపు చర్యలు చేపట్టాల్సి వుంటుంది. పొదుపు చర్యలకు అంగీకరించడం బాధాకరమే అయినా బాధ్యతతో తీసుకున్న నిర్ణయంగా సిప్రాస్ పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని ఆంక్షల కోసం ఒత్తిడి చేస్తున్న జర్మనీపై ఆయన మండిపడ్డారు. ప్రత్యేకించి జర్మనీ ఆర్థికమంత్రి వోల్ఫ్గ్యాంగ్నుద్దేశిస్తూ..యూరోజోన్ నుంచి గ్రీస్ను బయటకు పంపాలన్నదే ఆయన ఆంతర్యమని ఆరోపించారు. గ్రీస్కు ఉద్దీపన ప్రణాళిక అమలు కావాలంటే యూరోజోన్ దేశాల ఆర్థికమంత్రుల నుంచి ఆమోదం లభించాలి. శుక్రవారం సాయంత్రం జరిగే సమావేశంలోనే వారి నిర్ణయం వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది. అపులిచ్చే దేశాల పార్లమెంట్లలోనూ ఆమోదం లభించాలి. ఇప్పటికే ఫిన్ల్యాండ్ ఆమోదించగా, జర్మనీ నిర్ణయం కీలకం కానుంది.