Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్ఘాన్ రాజధాని కాబూల్లో ఘటన
కాబూల్ : రోడ్డు పక్కన బాంబు పేలడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో శనివారం జరిగింది. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. హెరాత్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి జిలానీ ఫర్హాద్ తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్ నగరంలో రద్దీగా ఉన్న మార్కెట్కు సమీపంలో స్కూటర్ బాంబు పేలింది. దీంతో, పరిసర ప్రాంతాలన్నీ భారీ శబ్ధంతో దద్దరిల్లాయి. పేలుడు ధాటికి రోడ్డు పక్కనే ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు తునాతునకలయ్యారు. మరో 20 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనకు పాల్పడినట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అయితే, గతంలో జరిగిన పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ పేలుళ్లు కూడా తాలిబన్ల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు పేలుడుకు పాల్పడి ఉంటారని జిలానీ ఫర్హాద్ అనుమానం వ్యక్తం చేశారు. యూఎన్ అసిస్టెంట్ మిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈఏడాది మార్చి31నాటికి జరిగిన పేలుళ్లలో 53 మంది మృతి చెందగా, 269 మంది గాయపడ్డారు. పాశ్చాత్య దేశాలు అఫ్ఘాన్ సర్కార్కు మద్దతివ్వడాన్ని నిరసిస్తూ 2001 నుంచి తాలిబన్లు పేలుళ్లకు పాల్పడుతున్నారు. భద్రతా బలగాలు, పోలీసులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. గత పదేండ్లలో తాలిబన్లు జరిపిన దాడుల్లో 32వేల మంది మృతిచెందగా, 60వేల మందికి పైగా గాయపడినట్టు ఐరాస వెల్లడించింది.