Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: వెనిజులాలో చట్టబద్ధంగా ఎన్నికైన మదురో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు మీద కుట్రలు పన్నుతున్న అమెరికా శుక్రవారం వాషింగ్టన్లోని వెనిజులా దౌత్య కార్యాలయంపైకి తన పోలీసులను ఉసిగొలిపింది. అమెరికన్ పోలీసుల చర్య అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనంటూ ప్రతిఘటించిన కార్యాలయంలోని నలుగురు వెనిజులా అధికారులను అరెస్టు చేశారు. పోలీసుల దాడి, అక్రమ అరెస్టులను అమెరికాలోని కోడ్ పింక్ అనే హక్కుల పోరాట సంస్థ ఖండించింది. హక్కుల కార్యకర్తల బృందం గత నెల 24 నుంచి ఆ భవనంలోపల ఉంటున్నది. వెనిజులా దౌత్య కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని వెనిజులాలో అచేతనావస్థలో ఉన్న జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జువాన్ గైడో మద్దతుదారులకు అప్పగించేందుకు అమెరికా చేస్తున్న యత్నాలను ఈ బృందం గట్టిగా ప్రతిఘటిస్తున్నది. వెనిజులా , అమెరికా మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతుండడంతో ఈ దౌత్య కార్యాలయాన్ని కాపాడుకునేందుకు ప్రజాతంత్రవాదులంతా కలసి రావాలని వెనిజులా దౌత్యవేత్తలు పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకు పలు హక్కుల సంఘాలు దౌత్యకార్యాలయానికి చేరుకుని అమెరికా యత్నాలను తిప్పికొట్టే పనిలో ఉన్నాయి. ఏమైనా కోరితే తప్ప మరో దేశ దౌత్య కార్యాలయంలోకి ఏ దేశమూ తన పోలీసులను పంపరాదని వియన్నా సదస్సు తీర్మానం చాలా స్పష్టంగా వుంది. అమెరికా చర్య దీనిని బాహాటంగా ఉల్లంఘించేదిగా వుందని హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి.