Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్కు అమెరికా, సౌదీ బెదిరింపులు
వాషింగ్టన్: తమ దేశ ప్రయోజనాలపై ఇరాన్ దాడి చేస్తే దానికి అదే చివరి రోజవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. 'ఇరాన్ యుద్ధం కోరుకుంటే అదే దానికి చివరి రోజవుతుంది. మరోసారి ఎప్పుడూ అమెరికాను హెచ్చరించొద్దు' అని ఆయన ఒక ట్వీట్లో ఇరాన్ను హెచ్చరించారు. అదే విధంగా తమ చమురు సంపదపై దాడి చేస్తే తాము పూర్తి బలంతో ప్రతిఘటిస్తామని, యుద్ధ నివారణ ఇరాన్ చేతుల్లోనే ఉందని సౌదీ అరేబియా హెచ్చరించింది. అమెరికా తన నౌకాదళానికి చెందిన యుద్ధ విమాన వాహకనౌకను, బి-32 తరహా బాంబర్ విమానాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించటంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరటం, ఎమిరేట్స్ తీరంలో సౌదీ చమురు నౌకలపై డ్రోన్ దాడులు జరగటం, వాటిపై సౌదీ స్పందన వంటి పరిణామాలపై స్పందించిన ఇరాన్ 'మమ్మల్ని బెదిరిస్తే తీవ్ర పరిణామాలుంటాయ'ని హెచ్చరించటం తెలిసిందే. ఇరాన్ మద్దతుతో ఇరాక్ సాయుధ గ్రూప్లు చేస్తున్న హెచ్చరికలను ఉటంకిస్తూ అక్కడి అత్యవసరం కాని దౌత్య సిబ్బందిని తక్షణం స్వదేశానికి వచ్చేయాలని ట్రంప్ సర్కారు ఆదేశించింది. ఆ వెంటనే యుద్ధ విమానవాహకనౌకను, యుద్ధ విమానాలను ఈ ప్రాంతానికి పంపింది. ఆదివారం బాగ్దాద్లో ప్రభుత్వ కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలు ఉన్న గ్రీన్జోన్ హౌసింగ్ ప్రాంతంపై రాకెట్ దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ రాకెట్ దాడి తమ సైనిక స్థావరాలను తాకలేదని, ఇందువల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అమెరికా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించనప్పటికీ, తాము మాత్రం ఈ ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయితే ట్రంప్ సర్కారులోని జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ ఇరాన్ను రెచ్చగొడుతున్నారని, ట్రంప్ ప్రభుత్వంలోని ఇతరులు దానిని వ్యతిరేకిస్తున్నారని అమెరికన్ మీడియా తన కథనాలలో వెల్లడించింది. ఈ పరిణామాలతో అప్రమత్తమైన గల్ఫ్ సహకార మండలి (జిసిసి) అరేబియన్ గల్ఫ్ ప్రాంతంలోని అంతర్జాతీయ సముద్ర జలాలపై విస్తృత స్తాయి భద్రతా పెట్రోలింగ్ను ప్రారంభించినట్లు బెహ్రెయిన్కు చెందిన అమెరికా నౌకాదళ విభాగం వెల్లడించింది.
కొట్టిపారేసిన ఇరాన్
మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటు న్నాయంటూ అమెరికన్ మీడియాలో వెలువడిన వార్తలను, యుద్ధం వచ్చే అవకాశాలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్ కొట్టిపారేశారు. ఇరాన్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తమతో యుద్ధం చేయగలమన్న భ్రమల్లో ఎవరూ లేరని ఆయన ఇరాన్ అధికార మీడియా సంస్థ ఇర్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
పాంపియోతో
సౌదీ యువరాజు చర్చలు
తాజా పరిణామాలపై సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో ఫోన్ ద్వారా చర్చించినట్టు సౌదీ సమాచార మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో వెల్లడించింది. తాము ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలనే కోరుకుంటున్నామని, అయితే ఇరాన్ తన దాడులను కొనసాగించినట్టయితే తాము చేతులు ముడుచుకు కూర్చోబోమని సౌదీ స్పష్టం చేసింది.