Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మన్బుకర్ అంతర్జాతీయ పురస్కారం'
- అవార్డు, ప్రశంసా పత్రాలతో పాటు 44.63 లక్షల నగదు పురస్కారం అందజేసిన నిర్వాహకులు
లండన్ : ఒమన్ రచయిత్రి జోకా అల్హార్తీకి ప్రతిష్టాత్మక 'మన్బుకర్ అంతర్జాతీయ పురస్కారం' దక్కింది. దీంతో, మన్బుకర్ పురస్కారం అందుకున్న తొలి అరాబిక్ రచయిత్రిగా ఆమె రికార్డు సాధించారు. జోకాకు అనువాదకురాలిగా సహకరించిన మారిలిన్ బూత్ పోస్లకు అవార్డు, ప్రశంసా పత్రాలతో పాటు 64,000 డాలర్ల (రూ.44,63, 136) నగదు పురస్కారం అందజేసినట్టు మన్బుకర్ ప్రైజ్ నిర్వాహకులు వెల్లడించారు. నగదు పురస్కారాన్ని ఇరువురు సమానంగా పంచుకోవాలని కోరారు. జోకా రచించిన 'సెలెస్టియల్ బాడీస్' నవల అత్యంత ప్రజాధరణ పొందింది. ముగ్గురు సోదరీమణుల ఇతివృత్తాన్ని తీసుకొని ఆమె నవల రచించారు. ఒమన్లోని అల్అవాఫి గ్రామంలో ముగ్గురు చెల్లెళ్లు ఎదుర్కొన్న ఆటుపోటులను నవలలో కండ్లకు కట్టినట్టు వివరించారు. బానిసత్వానికి వ్యతిరేకంగా తన రచనల్లో గళమెత్తారు. ఐరోపా దేశాల్లో , దక్షిణ అమెరికాలో ఆమె రచించిన నవలలు విశేష ప్రజాధరణ పొందాయి. అవార్డు అందుకున్న అనంతరం మీడియాతో జోకా మాట్లాడారు. ' అరాబిక్ సంస్కృతిని తన రచనల ద్వారా ప్రపంచ దేశాలతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. అరాబిక్ భాషలో రాసిన తన నవలకు మన్బుక్ ప్రైజ్ దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. నా రచనలకు ఒమన్ దేశమే ప్రేరణ. నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని జోకా అన్నారు.