Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా : అధ్యక్ష ఫలితాలు వెల్లడైన అనంతరం ఇండోనేషియా అల్లర్లతో అట్టుడుకుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో జోకో విడోడో రెండోసారి విజయం సాధించారు. దీంతో, ఆయన అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆయన గెలుపును జీర్ణించుకోలేకపోతున్న అక్కడి విపక్షాలు అల్లర్లకు తెరలేపాయి. ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుక్షణమే హింసాత్మక అల్లర్లకు ఆజ్యం పోశాయి. విడోడో మద్దతుదారులకు, ప్రతిపక్షనేత ప్రబోవో సుబియాంటో వర్గీయులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గాజు సీసాలు విసురుకున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలను దగ్ధం చేశారు. దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. విడోడో విజయాన్ని అంగీకరించబోమని విపక్షాలు కరాఖండీగా తేల్చి చెప్పాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించాయి. రీకౌంటింగ్ నిర్వహించాలని ప్రబోవో మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. హింసాత్మక ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు విధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో హింసను ప్రేరేపించే తప్పుడు వార్తలు రావడంతో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
విడోడో, ప్రబోబో వర్గీయుల మధ్య జరిగిన అల్లర్లలో ఆరుగురు మృతిచెందారు. 457 మంది గాయపడ్డారు. ఈ అల్లర్ల నేపథ్యంలో 257 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు జకార్తా పోలీస్ అధికార ప్రతినిధి ఆర్గో యువోనో తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్టు జకార్తా గవర్నర్ అనీస్ బస్వేదాన్ తెలిపారు. అల్లర్లను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.