Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటిలో కరుగుతున్న ప్లాస్టిక్ బ్యాగులు, పీవీసీ
- ఆక్సీజన్ను విడుదలజేసే బ్యాక్టీరియాపై దెబ్బ
- ముప్పు పక్షులకు, చేపలకు పరిమితం కాదు
- 'మాక్వేరీ యూనివర్సిటీ' పరిశోధకులు అధ్యయనం
ప్లాస్టిక్ వ్యర్థాలు, పీవీసీ (పైపుల తయారీలో వాడే ప్లాస్టిక్)...సముద్రాన్ని విషతుల్యం చేసేస్తున్నాయి. దీనివల్ల పర్యావరణానికి హితం చేసే బ్యాక్టీరియా దెబ్బతింటోంది. భూ వాతావరణంలో 10శాతం ఆక్సీజన్ను విడుదలచేసే 'ప్రోక్లోరోకోకస్' అనే బ్యాక్టీరియా మనుగడ ప్రమాదంలో పడిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది.
సిడ్నీ : సముద్రాల్ని, నదుల్ని ప్లాస్టిక్ బ్యాగులు, వ్యర్థాలు, పీవీసీ ప్లాస్టిక్ ఎలా కలుషితం చేస్తున్నాయో మనందరికీ తెలుసు. అయినా మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని మానటం లేదు. వాటి వ్యర్థాలు నదులు, సముద్రాల్ని చేరటాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నాడు. సముద్రంలో ఆక్సీజన్ కరువై వేలాది 'వేల్' చేపలు ఒడ్డుకు కొట్టుకురావటం, ప్లాస్టిక్ పదార్థాల్ని తినటం వల్ల సముద్రతీరంలో పెద్ద సంఖ్యలో పక్షులు మృత్యువాతపడటం కండ్లారా చూస్తున్నాం. ప్లాస్టిక్ బ్యాగులు, పీవీసీ, ఇతర వ్యర్థాలు సముద్రంలోకి పెద్ద ఎత్తున డంప్ అవటం వల్లే ఇదంతా జరుగుతోందన్నదీ మనకు తెలుసు.
అయితే ముప్పు సముద్ర చేపలకు, అక్కడి పక్షులకే పరిమితం కాలేదు. సమస్త మానవాళికి ముప్పు దగ్గరైంది. వాతావరణంలోకి ఆక్సీజన్ను విడుదలజేసే 'ప్రోక్లోరోకోకస్' అనే బ్యాక్టీరియా ప్లాస్టిక్ వ్యర్థాలకు బలవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో 'మెరీనా ట్రెంచ్'(జపాన్-ఫిలిప్పైన్స్కు సమీపంగా) వద్ద 10వేల మీటర్ల లోతున జరిగిన ఒక అధ్యయనం, ప్రపంచ మానవాళికి పొంచి ఉన్న ముప్పును తెలిపింది. మానవుడు వదులుతున్న ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్, పీవీసీ వ్యర్థాలు...సముద్రంలోకి చేరి విష రసాయానాలు విడుదల చేస్తున్నాయి.
ఇప్పుడేం చేయాలి?
తీరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని వెంటనే అరికట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంపై ఈయూ దేశాలు, బ్రిటన్ ఇటీవల కఠిన చర్యలు చేపట్టాయి. చేపల పరిశ్రమలో ప్లాస్టిక్ వాడకంపై ప్రపంచమంతా కదలలాల్సి ఉంది. పసిఫిక్ మహాసముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు చేపల పరిశ్రమ నుంచే వస్తోంది. వివిధ దేశాలు దీనిపై చట్టాలు తీసుకురావాలని పరిశోధకులు సూచిస్తున్నారు. సముద్రాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల్ని వెలికితీసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. శాస్త్రవేత్తలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాలు కదలాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.
- సముద్రతీరానికి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు బలమైన గాలులకు, తీక్షణమైన సూర్యరశ్మికి గురై, చిన్న చిన్న ముక్కలుగా మారుతోంది.
- ముక్కలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థం సముద్ర జలాల్లో సులభంగా కరుగుతోంది. సముద్ర జీవుల కడుపుల్లోకి చేరి వాటి మరణానికి కారణమవుతోంది.
- చేపలు మొదలు, సముద్ర జీవజాలం ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటోంది.
- అంతేకాదు మానవుడు ఏర్పాటుచేసుకున్న తాగునీటి వనరుల్లోకి కూడా ప్లాస్టిక్ రసాయనాలు కలుస్తున్నాయి.
'మాక్వేరీ యూనివర్సిటీ' ఏం చెప్పింది?
- ప్రపంచవ్యాప్తంగా సముద్రజలాలు ఎలా కలుషితం అవుతున్నాయో అన్నదానిపై ''మాక్వేరీ యూనివర్సిటీ'(సిడ్నీలో ఉంది) పరిశోధకులు అధ్యయనం చేశారు.
- పీవీసీ, ప్లాస్టిక్ బ్యాగుల్లోని రసాయనాల దెబ్బకు 'ప్రోక్లోరోకోకస్' అనే బ్యాక్టీరియా మనుగడ ప్రమాదంలో పడింది.
- సముద్రంలో జీవజాతులకు ఆహారం ఏర్పడటంలో, భూవాతారణంలోకి ఆక్సీజన్ విడుదల కావటంలో ఈ 'ప్రోక్లోరోకోకస్' బ్యాక్టీరియాది కీలకపాత్ర.
- మొత్తంగా వెలువడే ఆక్సీజన్లో ఈ బ్యాక్టీరియా ద్వారా జనించేది 10శాతం. పసిఫిక్ సముద్రంలో బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. మానవుడు ఊహించేదానికన్నా ఎక్కువగా రసాయనాలు చేరాయి.