Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతిపక్షాలు పిలుపు
టెలిఅవీవ్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. అవినీతి కేసుల విచారణ నుంచి ప్రధానిని రక్షించడానికి పార్లమెంట్లో ప్రత్యేకంగా చట్టాన్ని చేయాలన్న దిశగా అధికార 'లికుడ్' పార్టీ అడుగులు వేస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా బ్లూ అండ్ వైట్, లేబర్, మెరెట్జ్ తదితర వామపక్ష పార్టీలతోపాటు పలు పౌరసంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు అధికారాల్ని తగ్గించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాని నెతన్యాహు బారినుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ టెల్ అవీవ్ నగరంలో వేలాది మంది ఇజ్రాయిలీలు శనివారం రాత్రి భారీయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.ప్రధాని నెతన్యాహుకు అవినీతి ఆరోపణల నుండి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా చట్టాన్ని ఆమోదించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో టెలిఅవీవ్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై నిరసన ర్యాలీ నిర్వహించాయి. దాదాపు 80వేలమంది ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారని నిర్వాహకులు ప్రకటించారు. మోసం, అవినీతి..మొదలైన మూడు కేసుల్లో నెతన్యాహు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇదంతా తనపై రాజకీయ దురుద్దేశంతో, ప్రత్యర్థులు వేసిన కేసులుగా నెతన్యాహు అవినీతి ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. రాజీనామా చేసే ఉద్దేశం లేదని ప్రకటించారు. అవినీతి ఆరోపణల కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన పదవికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయినప్పటికీ అధికార 'లికుడ్' పార్టీలో నెతన్యాహు సన్నిహితులు పార్లమెంట్లో హడావిడి చేస్తున్నారు. విచారణ ముందుకు నెతన్యాహు వచ్చే పరిస్థితిని తప్పించడానికి సన్నిహితులు చట్టపరమైన మార్గాల్ని వెతుకుతున్నారు.