Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరకొరియాను ఆర్థికశక్తిగా తీర్చిదిద్దగలరు : ట్రంప్ ప్రశంస
టోక్యో: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చురుకైన నేత అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. కొరియా ద్వీపకల్పంలో ఆయన శాంతిస్థాపన కోరుకుంటున్నారని అన్నారు. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసు అంటూ కితాబిచ్చారు. కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్ర పరీక్షలు తిరిగి ప్రారంభించిందని ఇటీవల పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ట్రంప్ పై విధంగా స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ట్రంప్ ఆదేశ ప్రధాని షింజో అబెతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 'అణ్వస్త్రాలతో చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయం కిమ్కు బాగా తెలుసు. ఆయన చాలా చురుకైన వ్యక్తి.. అణ్వస్త్రాలను త్యజించాల్సి ఉందనీ ఆయనకు తెలుసు. ఉత్తరకొరియాను ఆర్థికశక్తిగా తీర్చిదిద్దగల సామర్థ్యం కిమ్లో ఉన్నది. ఉత్తరకొరియా అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తుంటే మాత్రం ఇది అసాధ్యం' అని వ్యాఖ్యానించారు. చైనాతో నెలకొన్న పరిస్థితులపై కూడా ట్రంప్ స్పందించారు. 'భవిష్యత్తులో చైనా, అమెరికా మధ్య మంచి వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాను. దీని కోసం ఎదురుచూస్తాము' అని అన్నారు.
అమెరికా నుంచి ఎఫ్-35 విమానాల కొనుగోలు!
జపాన్ తమ దేశం నుంచి ఎఫ్-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోందని ట్రంప్ ప్రకటించారు. '105 ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోలుకు జపాన్ ఆసక్తి కనబర్చింది. మా యుద్ధ విమానాలను కల్గివున్న అతి పెద్ద అమెరికా మిత్ర దేశంగా జపాన్ నిలవనుంది' అని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధ విమానాల కొనుగోలు కోసం 9.1 బిలియన్ డాలర్లు ( రూ. 63,251 కోట్లు ) జపాన్ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
జపాన్ నూతన చక్రవర్తిని కలిసిన ట్రంప్
జపాన్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జపాన్ నూతన చక్రవర్తి నరూహిటోను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చక్రవర్తి పీఠాన్ని నరూహిటో అధిష్ఠించిన అనంతరం ఆయనను తొలిసారిగా కలుసుకున్న అంతర్జాతీయ నేతగా ట్రంప్ నిలిచారు. సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఇంపీరియల్ ప్యాలెస్కు చేరుకున్న ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది.