Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
- పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
ఇస్లామాబాద్ : 69వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం భారత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సరిహద్దు దేశాలతో చక్కటి సంబంధాల్ని తాము ఆశిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి సంబంధాల ద్వారా ఇస్లామాబాద్, న్యూఢిల్లీ రెండూ లాభపడతాయని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం పాకిస్తాన్ నిజాయితీగా ప్రయత్నిస్తుందని, సమగ్ర చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారమవుతాయని తాము నమ్ముతున్నామని, ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం పెరగాలని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...''స్నేహపూర్వకమైన మంచి సంబంధాలు, సహకారం ద్వారా ఇరు దేశాల సంబంధాలు సరికొత్త దశకు చేరుకోవాలి. వీటి ఆధారంగా ఇరు దేశాల సమస్యలు పరిష్కారం జరగాలి'' అని షరీఫ్ అన్నారు.
పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ మాట్లాడుతూ..''భారత్తో స్నేహపూర్వక సంబంధాల నిర్మాణం కోసం పాకిస్తాన్ కట్టుబడి వుంది. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యం కోసం ఇరు దేశాలు కృషి చేయాల్సి వుంది. తద్వారా ఇరు దేశాల్లోని ప్రజలు లాభపడతారని మేము భావిస్తున్నా''మని అన్నారు. పాకిస్తాన్ శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశాన్ని పంపారు. అలాగే శనివారం భారత్ స్వాతంత్య్ర దినోత్సవం కావున, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా భారత్కు శుభాకాంక్షలు తెలియజేశారు.