Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.34వేల జరిమానా విధించిన న్యాయస్థానం
సిడ్నీ : ఆపిల్ సంస్థలో ఉద్యోగం సంపాదించాలని ఆస్ట్రేలియాకు చెందిన ఓ మైనర్ ఆకాంక్షించాడు. ఆ సంస్థలో ఉద్యోగం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా ఫర్వాలేదని భావించాడు. అంతే, ఆ సంస్థకు చెందిన అన్ని కంప్యూటర్ సిస్టమ్స్ను హ్యాక్ చేసి వీటిలోని విలువైన సమాచారాన్ని తస్కరించాడు. అంతేగాకుండా, ఆ సమాచారాన్ని ఇంటర్వూ నిర్వాహకులతో పంచుకొని మెప్పుపొంది ఉద్యోగం సాధించాలని భావించాడు. అనుమానం వచ్చిన ఇంటర్వ్యూ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అసలు నిజం బట్టబయలైంది. పోలీసులు, ఆపిల్ సంస్థ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం... 2015, డిసెంబర్లో అడిలైడ్కు చెందిన ఓ మైనర్ బాలుడు అధునాతన సాఫ్ట్వేర్ సాయంతో ఆపిల్ సంస్థ కంప్యూటర్ల నుంచి విలువైన సమాచారాన్ని హ్యాక్ చేశాడు.
మెల్బోర్న్కు చెందిన మరో మైనర్ బాలుడు అతనికి సహకరించాడు. అనంతరం 2017లో మరోసారి ఆపిల్ సంస్థ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు. ఆపిల్ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఉద్యోగం సంపాదించాలనే కోరికతోనే నిందితుడు అక్రమ మార్గాన్ని అనుసరించాడని, ఆపిల్ సంస్థను నష్టపరచాలనే దురుద్దేశం లేదని ప్రతివాది తరుఫు న్యాయవాది వాదనలు వినిపించాడు. 2015లో ఆపిల్ కంప్యూటర్లు హ్యాక్ చేసినప్పుడు నిందితుడి వయసు 13ఏండ్లు అని, ప్రస్తుతం కూడా నిందితుడు మైనరేనని అన్నాడు. నిందితున్ని క్షమించాలని న్యాయమూర్తిని అభ్యర్థించాడు. పరిహారం చెల్లించేందుకు నిందితుడి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మైనర్ బాలుడికి 500 డాలర్ల ( రూ.34,811 ) జరిమానా విధించింది. ఈమేరకు జస్టిస్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు.