Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీర్ణాశయంలో క్యాన్సర్ ఖాయం
- కూరగాయలు, పండ్లతో సమతుల ఆహారం ఉండాల్సిందే
- తాజా అధ్యయనంలో పరిశోధకులు వెల్లడి
వాషింగ్టన్ డీసీ : సమయానికి ఆహారం తీసుకోకపోయినా, పూర్తిగా 'జంక్ ఫుడ్'తో కడుపును నింపేస్తున్నా భవిష్యత్తులో క్యాన్సర్ రావటం ఖాయమని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. క్యాన్సర్ ఒక్కటే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చునని పరిశోధకులు అంచనావేశారు. సాంప్రదాయ ఆహారాన్ని పక్కకుపెట్టి, ప్రతి రోజూ జంక్ ఫుడ్ను తీసుకున్న కారణంగా ప్రపంచంలో 80వేల మంది క్యాన్సర్ బారిన పడ్డారని అధ్యయనం తేల్చింది. బోస్టన్లోని 'ఫ్రైడ్మ్యాన్ స్కూల్ ఆఫ్ న్యూట్రీషన్ సైన్స్ అండ్ పాలసీ'(టఫ్ట్స్ వర్సిటీ) వారు ఈ అధ్యయనాన్ని జరిపారు. కూరగాయలతో కూడిన సాంప్రదాయ ఆహారం, పండ్లు కాకుండా, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెరతో కూడిన జంక్ఫుడ్ను తీసుకోవటం చాలా ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్ని అధ్యయనం చేయగా, అందులో మద్యపానం కారణంగా క్యాన్సర్కు దారితీస్తున్నవి 4-6శాతం ఉన్నాయి. మద్యపానం తర్వాత అనేక మంది క్యాన్సర్ బారినపడటానికి కారణం 'జంక్ ఫుడ్'. 5 శాతం క్యాన్సర్ కేసులకు జంక్ఫుడ్కు సంబంధముందని వైద్యులు తేల్చారు. విపరీతంగా పెరిగిన శరీర బరువ 7శాతం కేసులకు, సరైన శారీరక శ్రమ లేక 2-3 శాతం కేసులు నమోదైనట్టు పరిశోధకులు అంచనావేశారు. ముఖ్యంగా జీర్ణాశయంలో వచ్చే క్యాన్సర్ రోగాలన్నీ సరైన ఆహారం తీసుకోకపోవటం వల్లే వస్తున్నాయి. 2015లో అమెరికాలో మొత్తం 52వేల క్యాన్సర్ కేసుల్లో 38శాతం జీర్ణాశయం సంబంధించినవే ఉన్నాయి. ఇందులో అత్యధిక సంఖ్యలో రోగులు జంక్ ఫుడ్ తినటం వల్లే ప్రమాదాన్ని తెచ్చికున్నారని తేలింది. ఈ రకమైన క్యాన్సర్ను అడ్డుకోవటంపై పరిశోధకులు కొన్ని సూచనలు కూడా చేశారు. క్యాన్సర్ను తీసుకొచ్చే కారకాలు ఉన్నాయని 'జంక్ ఫుడ్'పై ప్రభుత్వ హెచ్చరిక ఉన్నట్టుయితే, సమస్యను కొంతవరకు నియంత్రించ వచ్చునని తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొవాలంటే, వివిధ దేశాలు ఆహార అలవాట్లపై చైతన్యం తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా జంక్ఫుడ్ తీసుకోవటంలో ఉన్న రిస్క్ను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని అధ్యయనం స్పష్టం చేసింది.