Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్17న మరోసారి
- ఎన్నికల నిర్వాహణకు రంగం సిద్ధం
- కూటమి ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైన ప్రధాని నెతన్యాహూ
జెరూసలేమ్ : ఇజ్రాయిల్ పార్లమెంట్ ( నెస్సెట్) రద్దయింది. ఈఏడాది సెప్టెంబర్17న మరోసారి ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పార్లమెంట్ రద్దు తీర్మానానికి సంబంధించి బుధవారం రాత్రి నెస్సెట్లో ఓటింగ్ నిర్వహించారు. 74 మంది ఎంపీలు పార్లమెంట్ను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలనే తీర్మానానికి అనుకూలంగా, 45 మంది ప్రతికూలంగా ఓట్లు నమోదు చేశారు. ఇజ్రాయిల్లో ఏప్రిల్9న ఎన్నికలు జరిగాయి. ఈఎన్నికల్లో బెంజిమన్ నెతన్యాహూ నేతృత్వంలోని లికుడ్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 120 సీట్లలో లికుడ్ పార్టీ నేతృత్వంలోని కూటమి 65 సీట్లు సాధించింది. అయితే, మితవాద పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బెంజిమన్ నెతన్యాహూ విఫలమయ్యారు. ఇస్రాయేల్ బీతిన్ అనే నేత నేతృత్వంలోని ఓ మితవాద పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు బెంజిమన్ నెతన్యాహూ ఏర్పాటు చేయనున్న కూటమితో జతకట్టేందుకు నిరాకరించారు. ఐదుగురు సభ్యులు తగ్గడంతో ప్రభుత్వ ఏర్పాటుకు నెతన్యాహూ ఇతర పార్టీల సహకారం కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహపూర్వకంగా మెలుగుతున్న నెతన్యాహూ వైఖరి నచ్చకపోవడంతో ఇజ్రాయిల్ లేబర్పార్టీ నేతలు కూడా మద్దతిచ్చేందుకు నిరాకరించారు. ఒకవేళ లేబర్పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు నెతన్యాహూకు మద్దతిచ్చి ఉన్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉండేవి. నెతన్యాహూకు మద్దతిచ్చేందుకు ఇతర పార్టీనేతలెవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి ఎన్నికల నిర్వాహణ అనివార్యమైంది. 42 రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను చేరుకోకపోవడంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్నది.
ప్రతిష్టంభనకు కారణం
నెతన్యాహు ఐదోసారి ప్రధానిగా తన పదవీకాలం పూర్తి చేస్తారని అందరూ భావించారు. కానీ మాజీ రక్షణ మంత్రి ఎవిగ్దోర్ లిబర్మన్తో ఆయన ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు. ఆయన మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇజ్రాయిల్ బెతెన్యూ పార్టీకి సంబందించిన లిబర్మన్, అల్ట్రా-ఆర్థడాక్స్ యూదు పార్టీల మద్దతు కావాలంటే ఆ సంస్థల విద్యార్థులను నిర్బంధ సైనిక సేవల నుంచి మినహాయించాలని, డ్రాఫ్టులో మార్పులు చేయాలని షరతు పెట్టారు. నెతన్యాహు పార్టీతో కూటమిలో ప్రస్తుతం ఉన్న అల్ట్రా ఆర్థడాక్స్ యూదు పార్టీలు మాత్రం నిర్బంధ సైనిక సేవల్లో లభించే మినహాయింపుల్లో మార్పుల వల్ల తాము ఆధునిక ప్రపంచానికి దూరం అవుతామని, వాటిని వ్యతిరేకిస్తున్నాయి. కానీ లిబర్మన్ మాత్రం దాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు.
ఇజ్రాయిల్ అధ్యక్షుడు పార్లమెంట్లో ఇతర పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే లోపే నెతన్యాహు మళ్లీ ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా పార్లమెంటును రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ తర్వాత మీడియాతో నెతన్యాహూ మాట్లాడారు. 'నేను ఒక స్పష్టమైన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాను. దీంతో, ఎన్నికల్లో మేమే మరోసారి గెలుపొందుతాం. మేం గెలవడంతోపాటు ప్రజలు కూడా గెలుస్తారు' అని అన్నారు. నెతన్యాహూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల నుంచి తనను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. నెతన్యాహూ ఓ అమెరికా వ్యాపారి నుంచి బహుమతులు స్వీకరించారని, మీడియాలో సానుకూల కవరేజి కోసం లభ్ది చేకూర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని నెతన్యాహూ ఖండించారు.