Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు ఖైదీలు మృతి, 14 మందికి గాయాలు
క్వీటో : ఈక్వెడార్ జైలులో ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఆరుగురు ఖైదీలు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న రెండు గ్యాంగ్ల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. గ్వయాంకిల్ జైలు డైరెక్టర్ అల్ఫ్రెడో మునాస్ వెల్లడించిన వివరాల ప్రకారం...శుక్రవారం తెల్లవారుజామున ఖైదీల గ్రూపుల మధ్య హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. ఒకరిపై మరొకరు మారణాయుధాలతో దాడులకు దిగారు. పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ అల్లర్లలో ఆరుగురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. సహచర ఖైదీలు ఓ ఖైదీకి నిప్పంటించి సజీవ దహనం చేయడంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ప్రారంభమైనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వద్ద నుంచి తుపాకులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈక్వెడార్ జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచడంతో ఘర్షణలు చెలరేగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైళ్ల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈక్వెడార్ జైళ్లలో 28వేల మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు వీలుంది. అయితే, ప్రస్తుతం 38,500 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు.