Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాటిన్ అమెరికా మానవ హక్కుల సంఘం ఆందోళన
కారకాస్: వెనిజులాలో మదురో సర్కారును కూలదోసేందుకు కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాన్ని సమర్ధిస్తున్న అమెరికా ఆ దేశంపై విధించిన ఆంక్షలు అక్కడి క్యాన్సర్రోగుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయని లాటిన్ అమెరికా మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. వెనిజులా ప్రధాన ఆదాయ వనరుగావున్న ప్రభుత్వరంగ చమురు సంస్థ పిడివిఎస్ఎ పై అమెరికా ఆంక్షలు విధించిన ఫలితంగా ఆదాయం పడిపోవటంతో క్యాన్సర్రోగులకు వైద్యచికిత్సలు, సర్జికల్ చికిత్సలు, బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ప్రక్రియలన్నీ ఆగిపోయాయి. క్యాన్సర్, ఇతర వైద్య చికిత్సలకు అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వంనుండి అందకపోవటంతో యువకులు, వృద్ధులు ఇతరరోగులకు ప్రపంచంలో ఎక్కడా వైద్యచికిత్స లభించటం లేదు. పిడివిఎస్ఎ, దాని అనుబంధసంస్థల నుండి లభించే నిధులు స్థంభించిపోవటంతో అర్జెంటీనాలో వైద్యసహాయం అందక అక్కడ చికిత్స పొందుతున్న 26 మంది రోగులలో నలుగురు మృత్యువాత పడ్డారని ఈ స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్ మరియా యూజెనియా రష్యన్ చెప్పారు. నలుగురు రోగుల ఆరోగ్యం స్థిరంగావుండగా మరో 15 మంది పరిస్థితి విషమంగా వుందని ఆయన వివరించారు. అమెరికా విధించిన ఆంక్షలకారణంగా తాము వైద్య చికిత్సలకు డబ్బు చెల్లించలేకపోతున్నామని వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో విచారం వ్యక్తం చేశారు. ఆంక్షలకు ముందు తమ ప్రభుత్వం అన్ని చికిత్సలకు సకాలంలో డబ్బు పూర్తిగా చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. తాము అమెరికా దిగ్బంధానికి బాధితులుగా మారిన విషయాన్ని ప్రపంచం అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.