Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకరి మృతి, 17 మందికి గాయాలు
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో జంట పేలుళ్లు జరిగాయి. పేలుళ్లలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నస్రత్ రహీమీ వెల్లడించిన వివరాల ప్రకారం... యూనివర్సిటీ విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సులో బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ పేలుడు జరిగిన కొద్ది సేపటి తర్వాత రోడ్డుపక్కన మట్టిలో అమర్చి ఉంచిన రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు సహా ఏడుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడుకు కూడా బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ ప్రకటించుకోలేదు. అయితే, గతంలో జరిగిన పేలుళ్లు తమ పనేనని ఐఎస్ ప్రకటించుకుంది. ఉగ్రవాదులే జంట పేలుళ్లకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.