Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా శ్వేతపత్రం వెల్లడి
బీజింగ్: అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదు. అలా అని దానికి భయపడేదీ లేదని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం నాడిక్కడ ఒక శ్వేత పత్రాన్ని విడుదలజేసింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాల మెరుగు దలకు, ఇరదేశాల ప్రజల మౌలిక ప్రయోజనాలు, సుస్థిరత, సౌభాగ్యానికి ఆలంబనగా నిలిచాయని ఆ శ్వేతపత్రం పేర్కొంది. వాణిజ్య యుద్ధం ద్వారా తమను లొంగదీసుకోవా లని అమెరికా భావిస్తోంది. సుంకాల యుద్ధం ద్వారా అమెరికా మరోసారి గొప్పగా ఎదగాలని చూస్తోందని చైనా ఆరోపిం చింది. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కారం కోరుకుంటు న్నామని, మౌలిక సూత్రాలపై ఎటువంటి రాజీ పడబోమని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇరుదేశాల మధ్య కొనసాగు తున్న వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు గత ఏడాది నుండి ఇప్పటి వరకు జరిగిన 11 విడతల చర్చల ప్రక్రియలో తాము అనుసరిస్తున్న వైఖరిపై చైనా ప్రభుత్వం ఈ శ్వేతపత్రంలో వివరించింది. అమెరికా చేపట్టిన సుంకాల పెంపుదల చర్యలు అమెరికా ఆర్థికాభివృద్ధిని ఏ మాత్రం మెరుగుపర్చక పోగా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన చేటు తెస్తున్నాయని చైనా ప్రభుత్వం ఈ పత్రంలో వివరించింది. చర్చల సందర్భంగా కుదిరిన కొన్ని ఒప్పందాల నుంచి వెనుకంజ వేశారంటూ అమెరికా తమపై చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చైనా ఉప వాణిజ్య మంత్రి వాంగ్షోవెన్ మాట్లాడుతూ చైనా సార్వభౌమత్వంపై రాజీ పడాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందం అమలును పరిశీలించేందుకు తమకు అవకాశం కల్పించాలని, ముఖ్యంగా మేథోసంపత్తి హక్కులు (ఐపీఆర్), సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి అంశాలపై తమకు ప్రభుత్వ పరంగా హామీ కావాలని డిమాండ్ చేస్తోందని ఆయన వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించని వాంగ్ తమపై వత్తిడి పెంచేందుకు అమెరికా తమ ఉత్పత్తులపై టారిఫ్లను పెంచటంతో ఈ చర్చల ప్రక్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలిం దని చెప్పారు. ఎదుటి వారి సార్వభౌమత్వాన్ని, కీలక ప్రయోజ నాలను గౌరవించకుండా వాటిపై రాజీ పడాలంటూ వత్తిడి పెంచి ప్రయోజనం పొందాలనుకుంటే అటువంటి చర్చలు ఎన్నటికీ ఫలప్రదం కాబోవని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా దాడిని తిప్పికొట్టాలి..!
అమెరికా వాణిజ్య రంగంలో భారత్కు కల్పిస్తున్న ప్రాధాన్యతా హోదాను ఉపసంహరించుకోవాలన్న ట్రంప్ సర్కారు నిర్ణయం అవాంఛనీయం, అనూహ్యమైనదని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో పేర్కొంది. ఆదివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. భారత వాణిజ్య రంగంపై అమెరికా చేస్తున్న ఈ దాడిని తిప్పికొట్టాలంది. తనకు సానుకూలమైన వాణిజ్యం కోసం భారత్ను లొంగదీసుకునే క్రమంలోనే ట్రంప్ సర్కారు ఈ దాడులకు పాల్పడుతోందని విమర్శించింది. ఇంతకు ముందు కూడా భారత్ స్టీల్, అల్యూమినియం దిగుతమతులపై అమెరికా సుంకాలను పెంచిన విషయాన్ని పొలిట్బ్యూరో ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ అంశంపై అమెరికా ప్రభుత్వం గత మార్చిలోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానిని రద్దు చేయించేందుకు మోడీ సర్కారు ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొంది. దానికి ముందు ఇరాన్ నుండి చమురు కొనుగోళ్ల విషయంలో కూడా భారత్పై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం దాసోహమనటం తప్ప మరేమీ చేయలేకపోయిందని విమర్శించింది. జాతీయ వాదం అంటూ గొప్పలు చెప్పుకొనే నరేంద్ర మోడీ, బీజేపీ అమెరికా హుకుంలకు జీ హుజూర్ అనటం మినహా మరేమీ చేయలేకపోతున్నాయని విమర్శించింది.