Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మంది మృతి
డమాస్కస్ : సిరియా మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు రోజుల కిందట జరిగిన పేలుడులో పది మంది మృతిచెందిన ఘటన మరవక ముందే మరో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. డమాస్కస్ ఎస్పీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. సిరియా-టర్కీ సరిహద్దు రాష్ట్రం అలెప్పోలోని అజాజ్ నగరంలో పేలుడు సంభవించింది. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు సమాచారం. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయి. అయితే, ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఐఎస్ సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రెండు రోజుల కిందట రక్కా నగరంలో ఇలాంటి పేలుడే సంభవించింది. ఈ ఘటనలో పదిమంది మృతిచెందగా... పలువురు గాయపడ్డారు.