Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఆర్థికవేత్త స్టీఫెన్రోచ్ స్పష్టీకరణ
న్యూయార్క్: దేశీయంగా ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యకూ చైనాను నిందించటం అమెరికన్ రాజకీయ వేత్తలకు దురదృష్టకరమైన అలవాటుగా మారిందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త స్టీఫెన్రోచ్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నగదు నిల్వలు లేని తమ దేశ ఆర్థిక వ్యవస్థలోకి చైనా వంటి ఇతర ప్రధాన దేశాల నుంచి పెట్టుబడులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశీయంగా వేళ్లూనుకున్న సమస్యలకు బాధ్యత వహించకుండా ఎదుటివారిని నిందించటానికి మాత్రమే ఈ 'ఆరోపణల పర్వం' పనికొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక కాలంలో అమెరికా నికర పొదుపు రేటు 2.4 శాతం వద్ద నిలిచిపోయిందని ఆయన వివరించారు. 20వ శతాబ్దపు చివరి మూడు దశాబ్దాలలో 6.3 శాతం మేర కొనసాగిన అమెరికా పొదుపు రేటు 2019లో సగానికన్నా తక్కువ పడిపోయిందన్నారు. వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు దిగుమతులపై టారిఫ్లు పెంచే వ్యూహం అత్యంత ఘోరమైన తప్పిదమని, ఈ చర్యలు వాణిజ్య లోటును ఏ మాత్రం తగ్గించలేవని ఆయన అన్నారు. వాణిజ్యలోటును భర్తీ చేసుకోవాలనుకుంటే ముందుగా దేశీయ పొదుపును ప్రోత్సహించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు. అయితే రానున్న సంవత్సరాలలో బడ్జెట్లోటు పెరగనున్న నేపథ్యంలో ఇందుకు అవకాశాలు దాదాపుగా మృగ్యమైపోయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ఆర్థిక భవితకు చైనా నుండి ముప్పు వుందంటూ అమెరికా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఈ విమర్శలు, ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని, వాస్తవానికి పొదుపును నిర్లక్ష్యం చేయటం వల్లే వాణిజ్య లోటు పెరుగుతోందని, దీని కారణంగానే 5జి సామర్ధ్యం వంటి భావి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే సామర్ధ్యానికి కూడా గండిపడుతుందన్నారు. అమెరికా అనుసరిస్తున్న రక్షణాత్మక రాజకీయాలు స్థిరమైన ప్రపంచ ఆర్థికాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.
దెబ్బకు దెబ్బ అన్న రీతిలో టారిఫ్లను పెంచుకుంటూ పోతే అమెరికా-చైనా మధ్య ఆర్థిక కార్యకలాపాలకు గండిపడటమే కాక ప్రపంచ కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సప్లయి చైన్లు కీలకమైనవన్న ఆయన వీటికి దెబ్బ తగిలితే వడ్డీరేట్లు పెరుగుతాయని, ఫలితంగా ప్రపంచ ఫైనాన్సియల్ మార్కెట్లు దెబ్బతింటాయని రోచ్ హెచ్చరించారు.