Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఎఫ్ ఛీఫ్ లగార్డే
వాషింగ్టన్: ప్రపంచంలో ప్రస్తుతం వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించటం త్వరలో జరుగనున్న జీ20 దేశాల సదస్సు ముందున్న తక్షణ ప్రాధాన్యత అని ఐఎంఎఫ్ ఛీఫ్ క్రిస్టిన్ లగార్డే స్పష్టం చేశారు. త్వరలో జపాన్లో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల భేటీ జరుగనున్న నేపథ్యంలో లగార్డే తన బ్లాగ్లో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న టారిఫ్ పెంపుదల పోటీ ఇరుదేశాల అభివృద్ధికి బ్రేక్ వేయటంతో పాటు ప్రపంచాభివృద్ధికి కూడా విఘాతం కలిగిస్తుందన్నారు. 'ఈ స్వయం కల్పిత గాయాలను తప్పనిసరిగా నయం చేసుకోవాలని' ఆమె తన బ్లాగ్లో పేర్కొన్నారు. ఇందుకు ఇటీవలి కాలంలో అమలులోకి వచ్చిన వాణిజ్య అడ్డంకులను తొలగించటం, భవిష్యత్లో మరే రూపంలోనైనా ఇటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలని ఆమె సూచించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య చర్చలు విఫలమై ఇరుదేశాలు పరస్పరం ప్రతీకార టారిఫ్లు పెంచుకుంటున్న ప్రస్తుత సమయంలో జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, గవర్నర్ల సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రపంచాభివృద్ధికి ఎదురవుతున్న ఇతర అడ్డంకులను కూడా అధిగమించాలని లగార్డే ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వాణిజ్యం మందగమనంలో వున్న సమయంలో వాణిజ్య పోరును విస్తరించటం ద్వారా ప్రస్తుత పరిస్థితి అత్యంత విషాదభరితంగా మారుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
చైనా-అమెరికాలు పెంచుకుంటూ పోతున్న ప్రతీకార టారిఫ్లు వచ్చే ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధిని తగ్గిస్తాయని, 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి భిన్నంగా అనేక దేశాల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్రవ్య విధానాలు మరో మాంద్యానికి దారి తీసే ప్రమాదం వుందని హెచ్చరించారు. వివిధ దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు బ్రెగ్జిట్ వంటి అంశాలు సంక్షోభం నుండి కోలుకునేందుకు అవసరమైన బలాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని జీ20 సమావేశం కోసం రూపొందించిన నివేదికలో లగార్డే పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితుల్లో వుందని, దీనిని అధిగమించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలను అత్యంత జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం వుందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థికాభివృద్ధి రేటు 3.3 శాతం మేర వుంటుందని గత ఏప్రిల్లో అంచనా వేసిన ఐఎంఎఫ్ వచ్చే ఏడాది ఇది 3.6 శాతానికి పెరిగే అవకాశం వుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.