Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 మంది దుర్మరణం
- మృతుల్లో 12 మంది భారతీయులు
దుబాయ్ : దుబాయ్ లో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మృతుల్లో 12 మంది భారతీయులు ఉన్నారని భారత రాయభార కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ఈ ఘటనలో 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 31 మంది ప్రయాణికులతో కూడిన బస్సు దుబాయ్ నుంచి మస్కట్ వస్తుండగా అల్ రషీదియా మెట్రో స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రాంగ్రూట్లోకి వెళ్లి బస్సు కంటే ఎత్తుగా ఉన్న రోడ్డు సిగ్నల్ బోర్డును ఢీ కొనడంతో 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రమాదానికి గురైన బస్సు ఒమన్ దేశ ప్రభుత్వ రవాణా సంస్థకు చెందినదిగా యుఎఇ అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, కొంతమంది మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని దుబాయి పోలీసులు వెల్లడించారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిలో విక్రమ్ జవహర్ ఠాకూర్, విమల్ కుమార్ కార్తికేయన్, కిరణ్ జానీ, ఫిరోజ్ఖాన్, రేష్మ ఫిరోజ్ ఖాన్, జమాలుద్దీన్ అరక్కవెట్టిల్, వాసుదేవ్ విశ్వాన్దాస్, రాజన్ పుతియా పురాయల్ గోపాలన్, ప్రభుల మంధవన్ దీపా కుమార్, రోష్ని మూల్ ఛాందిని, ఉమ్మర్ చోనోకతవాట్, నాబిల్ ఉమ్మర్ ఉన్నారు. గాయపడిన నలుగురు భారతీయులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భారత రాయభార కార్యాలయం తెలిపింది. మృతదేహాలను భారత్ తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్న భారత కాన్సులేట్ అధికారి విపుల్ తెలిపారు. బాధిత కుటుంబసభ్యులు ఎవరైనా సంప్రదించేందుకు భారత రాయభార కార్యాలయం హెల్ప్లైన్ సెంటర్ 971-565463903ను ఏర్పాటు చేసింది. ప్రమాదంలో మృతిచెందిన వారికి సంతాపం ప్రకటిస్తూ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. సహాయక చర్యల్లో పాల్గనాలని రాయభార కార్యాలయ అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. 50 ఏండ్ల వయస్సున్న డ్రైవర్ రోడ్డు సిగ్నల్స్ గమనించకుండా భారీ వాహనాలు నిషేదించిన మార్గంలో బస్సును నడిపాడని, ఈ క్రమంలో అతివేగంతో సిగ్నల్ బోర్డును ఢి కొనడంతో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.