Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరారోపణలు ఎదుర్కొంటున్న అనుమానితులను చైనాకు అప్పగించే బిల్లుపై వ్యతిరేకత
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్లో నిరసనలు మిన్నంటాయి. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితులను చైనా కోర్టుల్లో విచారించాలని హాంగ్కాంగ్ యోచిస్తున్నది. ఈ మేరకు ఓ బిల్లును ప్రతిపాదించింది. అనుమానితులను చైనాకు అప్పగించే బిల్లును వ్యతిరేకిస్తూ హాంగ్కాంగ్ నగరంలో నిరసనకారులు భారీ ర్యాలీ తీశారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. హాంగ్కాంగ్ సర్కార్ తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం...1.3లక్షల మందికిపైగా నిరసనకారులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. విక్టోరియా పార్క్ వద్ద ప్రారంభమైన భారీ ర్యాలీ లెజిస్లేటివ్ కౌన్సిల్ భవనం వరకు కొనసాగింది. ఈ బిల్లును ప్రతిపాదించిన హాంగ్కాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కరీ లామ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చైనా చట్టాలపై తమకు నమ్మకం లేదని ఆరోపించారు. ' అనుమానితులను, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని చైనాకు అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి' అని డెమోక్రటిక్ పార్టీ ఎంపీ జేమ్స్ అభిప్రాయపడ్డారు. చైనాలో చట్టాలకు పదునెక్కువ. నేరాలను అదుపు చేయా లంటే నేరారోపణలను ఎదుర్కొంటున్నవారిని చైనాకు అప్పగించడమే సరైన నిర్ణయమని కరీ లామ్ చెబుతున్నారు. కాగా, జాతీయ భద్రతా చట్టాలను మరింత కట్టుదిట్టం చేయాలనే ప్రతిపాదనతో 2003లోనూ హాంగ్కాంగ్ సర్కార్ ఓ బిల్లును రూపొందించింది. అప్పట్లో కూడా ఈ బిల్లును నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 1989లోనూ చైనాలోని టైనన్మెన్ స్క్వేర్ నిరసనలకు మద్దతుగా 1.5లక్షల మంది హాంగ్కాంగ్ పౌరులు నిరసన తెలిపారు.