Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30లోపు ఆదాయ వివరాలు సమర్పించాలి : ఇమ్రాన్
ఇస్లామాబాద్: పాక్ పౌరులు తమ వద్ద అక్రమంగా కల్గివున్న సొత్తును ప్రభుత్వానికి అప్పగించినట్టయితే చర్యలుండవని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. 'పన్ను క్షమాపణ పథకం' కింద పౌరులు ఈ సౌలభ్యాన్ని పొందవచ్చునని అన్నారు. ఈనెల30లోపు దేశ ప్రజలంతా తమ ఆదాయ వివరాలను వెల్లడించాలని కోరారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్ను గట్టెక్కించేందుకు, ఆదాయ వనరుల కోసం ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాద దేశంగా ముద్ర పడటంతో అమెరికా సహా పలు దేశాల నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యల నుంచి గటెక్కేందుకు ఉన్న అన్ని వనరులను ఇమ్రాన్ పరిశీలిస్తున్నారు. ఇమ్రాన్ సర్కార్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. 'మనది గొప్ప దేశం కావాలంటే మనలో మార్పు రావాలి. ప్రజలందరూ 'ఆస్తుల ప్రకటన పథకం'లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే మీరు పన్నులు చెల్లించకపోతే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం సాధ్యం కాదు ' అని అన్నారు. ఈనెల 30లోపు అక్రమాస్తులు, బినామీ పేర్ల మీదున్న ఆస్తులు, బ్యాంకు ఖాతాలు వివరాలను వెల్లడించి, వాటికి పన్ను చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 'ఆస్తుల వెల్లడికి మీకు జూన్ 30 వరకూ మాత్రమే అవకాశం ఇస్తున్నా. ఇప్పటికే ఎవరైతే బినామీల పేరుతో అక్రమాస్తులు సంపాదించారో వారి వివరాలను ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించాయి. వారి మొత్తం జాతకం మా దగ్గర ఉంది. మీరు మీ అక్రమ సంపాదనను దాచాలని చూసినట్టయితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. ఈ అవకాశం మళ్ళీ రాదు. స్వదేశానికి మేలు చేయండి. మీ చిన్నారుల భవిష్యత్కు బంగారు బాటలు వేయండి. దేశాన్ని సొంత కాళ్లపై నిలబడేలా చేసి, పేదరికాన్ని రూపు మాపండి' అంటూ విజ్ఞప్తి చేశారు. గత పదేండ్ల కాలంలో పాకిస్థాన్ అప్పులు రూ.6వేల బిలియన్ల నుంచి రూ.30వేల బిలియన్లకు చేరిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.