Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్ఘాన్కు మకాం మార్చిన ఐఎస్
కాబూల్ : ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పలు దేశాల్లో యాంటీ మిలిటెంట్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సిరియా, ఇరాక్ దేశాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులను పారద్రోలేందుకు రష్యా ముందుకు వచ్చింది. ఈ దేశాల్లో రక్తపుటేరులు ప్రవహించడాన్ని చూసి చలించింది. తన మిత్రదేశాలతో కలిసి యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించింది. రష్యా మిత్రదేశాలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. పలువురు మిలిటెంట్లను అరెస్ట్ చేశాయి. తాజాగా, ఐఎస్ తమ మకాంను అఫ్ఘనిస్థాన్కు మార్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అఫ్ఘాన్లో తలదాచుకుంటూ పశ్చిమ దేశాల్లో దాడులు నిర్వహించి అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్టు తెలిపాయి. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం కూడా ఐఎస్కు లాభించింది. దీంతో, యువతీ,యువకులకు శిక్షణ ఇచ్చి ఆత్మాహుతి దాడులు నిర్వహించేలా ఐఎస్ ప్రేరేపిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తాలిబన్ల అంతర్గత పోరుతో అఫ్ఘనిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఐఎస్ కూడా అఫ్ఘాన్లోనే మకాం వేసిందని అందిన సమాచారం అధికారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. అఫ్ఘాన్లో శాంతియువత వాతావరణాన్ని సృష్టించేందుకు ఇక్కడి ప్రభుత్వం తాలిబన్లతో చర్చలకు సిద్ధమైంది. ఈచర్చల్లో తాలిబన్ సంస్థ కీలక నేతలు, ప్రభుత్వ అధికారులు పాల్గొనకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఎలాగైనా తాలిబన్లతో సంప్రదింపులు జరిపి వారి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని భావిస్తున్న అఫ్ఘాన్ సర్కార్కు తాజాగా ఐఎస్ చొరబాటు సమస్య తలనొప్పిగా మారింది. అఫ్ఘాన్లో తాలదాచుకున్న ఐఎస్ సభ్యులు యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల్లో ఒంటరి తోడేలు దాడులకు పాల్పడాలని రెక్కీలు నిర్వహించినట్టు యూఎస్ నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎప్పుడు, ఏ ప్రాంతంలో ఆత్మాహుతి దాడులు జరుగుతాయో అర్థంకాకపోవడంతో తలలు పట్టుకున్నాయి. ఈయూ, అమెరికా దేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వరుస దాడులు, పేలుళ్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. రానున్న రోజుల్లో ఈ దాడుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదముందని సాక్ష్యాత్తూ యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలే హెచ్చరిస్తుండటం కలవరం సృష్టిస్తున్నది.
ఐఎస్ తమ ఉనికిని చాటుకునేందుకు భీకర దాడులకు పాల్పడే అవకాశముంది. 2014 నుంచి అఫ్ఘాన్లో ఐఎస్ పలు హింసాత్మక దాడులకు పాల్పడుతూ వస్తున్నది. అయితే, మధ్య ఆసియా, పాక్ సరిహద్దు, ఇరాన్, సిరియా ప్రాంతాల నుంచి వచ్చిన ఐఎస్ సభ్యులు గతంలో అఫ్ఘాన్లో దాడులకు పాల్పడేవారు.
అంతేగాకుండా, తాలిబన్లు సైతం ఐఎస్ భావాల పట్ల ఆకర్షితులై ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ముందంజలో ఉండటం ఇంటెలిజెన్స్ వర్గాలను కలవరపెడుతున్నది. ఐఎస్ చీఫ్ అబూ బకర్అల్ బాగ్దాదీతో కలిసి ముందు సాగేందుకు కీలక తాలిబన్నేతలు సమావేశమై నిర్ణయించుకున్నట్టు ఐఎస్ సానుభూతి పత్రికలు ప్రకటించుకున్నాయి. మధ్య ప్రాఛ్యదేశాల్లో అలజడి సృష్టించేందుకు ఐఎస్ ప్రయత్నిస్తున్నది. నన్గార్హార్, నూరిస్థాన్, కునార్, లాగ్మాన్ ప్రావిన్స్లో ఇప్పటికే ఐఎస్ చొరబడినట్టు నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఐఎస్ తరిమివేత కోసం ప్రపంచ దేశాల సాయం కోరేందుకు అఫ్ఘాన్ సర్కార్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై ఐరాస భద్రతా మండలిలో చర్చించాలని భావిస్తున్నది.
కుర్దు తిరుగుబాటుదారుల ఔదార్యం
సిరియాలో అపహరణకు గురైన ఫ్రాన్స్, నెదర్లాండ్ జాతీయుల చిన్నారులను కుర్దు తిరుగుబాటుదారులు ప్రభుత్వ ప్రతినిధులకు అప్పగించి తమ ఔదారాన్ని చాటుకున్నారు. కిడ్నాప్కు గురైన చిన్నారులను ఐఎస్ శిబిరాల నుంచి తీసుకొచ్చినట్టు తెలిపారు. వీరందరినీ తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నట్టు సిరియా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ కరీమ్ ఒమర్ తెలిపారు. సిరియాలో 2011లో అంతర్యుద్ధం చెలరేగింది. సిరియా అధ్యక్షుడు అస్సద్ను గద్దె దించేందుకు ఉగ్రవాదులు హింసాత్మక దాడులకు దిగారు. దీంతో, సిరియా రణరం గంగా మారింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకరపోరులో వేలాది మంది మృతిచెందారు. లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. సిరియాలో శాంతిస్థాపన కోసం అస్సద్ రష్యా సహకారం కోరారు. సిరియా, రష్యా భద్రతా బలగాలు నిర్వహించిన ఉమ్మడి ఉగ్రవ్యతిరేక ఆపరేషన్ ఫలితంగా ఉగ్రవాదం కాస్త తగ్గింది. సిరియా, రష్యా బలగాలు వైమానిక దాడులు నిర్వహించి వందలాది ఉగ్రశిబిరాలను ధ్వంసంచేశాయి. దీంతో, ఉగ్రవాదులు ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అయితే, ఉగ్రవాద నిర్మూలనలో కుర్దు తిరుగుబాటుదారులు కూడా తమ వంత పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే, సిరియా సర్కార్ మాత్రం కుర్దు తిరుగుబాటుదారులపై ఉగ్రవాద ముద్ర వేసి వారి సాహసాలను, సుకృత్యాలను గుర్తించడంలేదు. పలు ప్రాంతాల్లో కుర్దు తిరుగుబాటుదారులను కూడా సిరియా బలగాలు మట్టుబెట్టాయి.