Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి మద్దతుగా సెనేటర్ శాండర్స్
- ఔత్సాహికులూ.. పారా హుషార్!
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
ఆర్కాన్సాస్: ''పీత బాధలు పీతవి'' అని ఊరికే అనలేదు మహానుభావులు. ముఖ్యంగా అధికాదాయం కోసం అమెరికా బాట పట్టాలని చూసే భారతీయ ఔత్సాహికులు తెలుసుకోవాల్సిన విషయమిది! ఇబ్బడిముబ్బడిగా సంపాదించాలంటే 'అమెరికానే గమ్యం' అనే రోజులు పోయాయి. ట్రంప్ వచ్చాక ఆంక్షల మీద ఆంక్షలు విధించుకుంటూ వెళ్తుంటే ఆయనో 'తిక్కలోడు' అని సరిపుచ్చుకునే వాళ్లే ఎక్కువయ్యారు! నిజానికి అమెరికాలో ఆ దేశ కార్మికులకు కనీస వేతనాలు లభించడం లేదు. వారు సంపాదించే మొత్తంతో కనీసం ఇంటిల్లిపాదికీ తిండిపెట్టలేక పోతున్నారు. ఇదేదో అక్కసుకొద్ది రాస్తున్నది కాదు. కేవలం పచ్చి నిజం మాత్రమే! వివరాలు..
అమెరికాలో అత్యంత సంపన్న కుటుంబంగా 'వాల్టన్ ఫ్యామిలీ' పేరు పొందింది. ప్రఖ్యాత చిల్లర వర్తక సంస్థ ''వాల్మార్ట్''కు ఆ కుటుంబ సభ్యులే అధిపతులు. ఆ దేశంలో ప్రయివేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చే సంస్థగా దానికి పేరుంది. అంతులేని లాభాలతో సంపదను ఇబ్బడిముబ్బడిగా పోగుచేసుకుంటోంది ఆ అపర కుబేర కుటుంబం! అమెరికా.. అందునా అత్యంత సంపద్వంత కుటుంబ నేతృత్వంలోని సంస్థలో ఉద్యోగమంటే ఎగిరి గంతేయరూ! కానీ, వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఏటా 140 కోట్లను వార్షిక వేతనంగా ఆ కంపెనీ సీఈఓ పొందుతుంటే.. తద్విరుద్ధంగా అందులో పని చేసే కార్మికులు క్షుద్బాధతో అల్లాడుతున్నారు. ఇది అషామాషీ వ్యక్తులు వెల్లడించిన విషయం కాదు. సాక్షాత్తూ అమెరికా చట్టసభ సభ్యులు(సెనేటర్) బెర్నీ శాండర్స్ వెల్లడించిన వాస్తవమది. ఆయన అల్లాటప్పా సెనేటర్ కాదు; రానున్న 2020 ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అధ్యక్షపదవికి పోరాడే వ్యక్తి! ఇంకా సాధికారికంగా చెప్పాలంటే ఆ అంశాన్ని ఆయన సాక్షాత్తూ వాల్మార్ట్ షేర్హౌల్డర్ల వార్షిక సమావేశంలోనే వెల్లడించడం విశేషం! అంతేనా? కార్మికులకు గంటకు కనీసం 15 డాలర్ల వేతనం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు కూడా! వాల్మార్ట్ ఉద్యోగులు వేతనాలు సరిపోక జీవించేందుకు ప్రభుత్వ పథకాలైన ఆహార భద్రత, వైద్య చేయూత, గృహనిర్మాణం తదితరాల్లో లబ్ధిదారులుగా చేరుతున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆ కంపెనీ కార్మికులకు చెల్లిస్తున్నది గంటకు కేవలం 11 డాలర్లు. దానిని కనీసం 15 డాలర్లకు పెంచాలని ఆ కంపెనీ కార్మికుల పక్షాన శాండర్స్ గళమెత్తారు. ఆయన నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. వారందరి పక్షాన శాండర్స్ మాట్లాడుతూ కార్మికులకు ''కనీస జీవన స్థాయి వేతనాన్ని'' చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇదంతా చదువుతుంటే అచ్చు మనదేశంలో జరుగుతోన్న ఘటనలాగా అన్పించడం లేదూ?! అలా అన్పిస్తే- దూరపుకొండల నునుపుదనం కరిగిపోతున్న దృశ్యం కండ్లముందు కదలాడాలి మరి! కాబట్టి, భారత ఔత్సాహికులూ.. జర పారాహుషార్ అనక తప్పదు!!