Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిమ్ సోదరుడి హత్య ఉదంతంపై వాల్స్ట్రీట్ జర్నల్ కథనం
వాషింగ్టన్ : మలేషియాలో దారుణహత్యకు గురైన ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు జోంగ్ నామ్...అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సీఐఏ)కి ఏజెంట్గా పనిచేశారంటూ వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఈమేరకు సీఐఏ అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలిపింది. కిమ్కు సంబంధించిన పలు వివరాలను కూడా జోంగ్ నామ్ ద్వారా సీఐఏ రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే, ఉత్తరకొరియా నుంచి ఇతర దేశానికి వెళ్లి ప్రవాసంలో ఉన్న జోంగ్నామ్కు స్వదేశంలో జరిగిన ఘటనలపై మాత్రం ఎలాంటి అవగాహన లేదని తెలిపింది. అయితే, కిమ్ గురించి మాత్రం జోంగ్నామ్కు సంపూర్ణ అవగాహన ఉందని తెలిపింది. జోంగ్ నామ్కు అమెరికాతో పాటు పలు దేశాల సైనికాధికారులతో సత్సంబంధాలు ఉన్నాయని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. 2017లో మలేషియా రాజధాని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జోంగ్నామ్పై విష ప్రయోగం జరగడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
జోంగ్నామ్పై నిషేధిత వీఎక్స్ రసాయనం ప్రయోగించి ఇద్దరు మహిళలు హత్య చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా పోలీస్ అధికారులు గుర్తించారు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఇండోనేషియాకు చెందిన సిటీ ఇషాను మార్చి నెలలో విడుదల చేయగా, వియత్నాంకు చెందిన డోన్తి హువాంగ్ అనే మహిళ మే నెలలో విడుదలైంది. కిమ్ కనుసన్నల్లోనే అతని సోదరుడి హత్య జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలను కిమ్ తోసిపుచ్చారు. జోంగ్నామ్ హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. మలేషియాలో ఉన్న సీఐఏ ఏజెంట్ని కలిసేందుకు వచ్చిన జోంగ్నామ్ హత్యకు గురైనట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.