Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విచారం వ్యక్తం చేసిన మాలి ప్రధాని
బకామో : మాలిలో జరిగిన నరమేధంపై ప్రధాని బౌబౌ సీజ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటిస్తామని భరోసా ఇచ్చారు. సోమవారం జరిగిన ఈ హింసాకాండలో 100 మంది మృతిచెందారు. వీరిలో 24 మంది చిన్నారులు ఉన్నారు. నరమేధం జరిగిన సొబానే దా గ్రామాన్ని ప్రధాని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో భద్రత ప్రమాణాలు లోపించిన విషయాన్ని అంగీకరించారు. ఇకపై భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని, ప్రజలు ఆందోళన చెందొద్దని కోరారు. మధ్య మాలిలోని సెబోనే దా గ్రామంపై ఫులాని తెగకు చెందిన తిరుగుబాటుదారులు సోమవారం మెరుపు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులను వెంటాడి చితకబాదారు. అనంతరం అతి పదునైన ఆయుధాలతో వారి వెన్నుముక, తలభాగాల్లో పొడిచి చంపారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా ఉపేక్షించకుండా అత్యంత కిరాతకంగా హతమార్చి పరారయ్యారు. మాలిలో జరిగిన అత్యంత కిరాతకమైన ఘటల్లో ఇది ఒకటి. ఈ ఘటన జరిగిన అనంతరం మధ్య మాలిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఫులాని తెగకు, డోగన్ వేటగాళ్లకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈఏడాది మార్చిలో ఫులాని తెగకు చెందిన పశువుల కాపరులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 150 మంది మృతి చెందారు. ఈ దాడి డోగన్ వేటగాండ్ల పనేనని ఫులాని తెగకు చెందినవారు అనుమాని స్తున్నారు. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా పటిష్ట నిఘా పెంపొదిస్తామని అధ్యక్షుడు ఇబ్రహీమ్ బౌబకర్ కీటా తెలిపారు. ప్రజలంతా ఐకమత్యంగా మెలగాలని ఆయన పిలుపునిచ్చారు.