Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 వేల కుటుంబాలు: ఐఓఎం వెల్లడి
ట్రిపోలీ: ట్రిపోలీ దక్షిణ ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణలు, పోరాటాలలో దాదాపు 18 వేలకు పైగా కుటుంబాలు (94 వేల మంది) నిర్వాసితులయ్యాయని ఐరాసకు చెందిన వలస వ్యవహారాల అంతర్జాతీయ సంస్థ (ఐఒఎం) వెల్లడించింది. నిర్వాసితుల్లో దాదాపు 48 శాతం మంది 18 ఏండ్ల లోపు చిన్నారులేనని, వీరిలో దాదాపు 3,900 మందికి పైగా నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న శరణార్థి శిబిరాలలో నివశిస్తున్నారని ఐఒఎం తన ప్రకటనలో తెలిపింది. ఘర్షణల సమీప ప్రాంతాలకు వెళ్లే వారికి ఇప్పటికీ ముప్పు పొంచి వున్నదని ఈ సంస్థ హెచ్చరించింది. మార్షల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ గత ఏప్రిల్ 4న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించటంతో సాయుధ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ట్రిపోలీ దక్షిణ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. హఫ్తార్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలకు నిత్యావసర సరఫరాలను నిలిపివేయటంలో తాము చేపట్టిన వోల్కనో ఆఫ్ రేజ్ ఆపరేషన్ విజయవంతమైందని లిబియా అధ్యక్ష మండలి ప్రకటించింది. తిరుగుబాటు దారుల వద్ద రెండు రోజులకు సరిపడిన ఆహార నిల్వలు మాత్రమే వున్నాయని ప్రభుత్వం చెబుతుండగా, ఈ ఘర్షణలు గత రెండు నెలలుగా కొనసాగుతుండటం గమనార్హం.