Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ అధ్యక్షుడు
తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ జపాన్ ప్రధాని షింజో అబేతో అన్నారు. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించేందుకు షింజో అబే మధ్యవర్తిత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ అంశంపై షింజో అబే రౌహానీతో చర్చించారు. ట్రంప్ పంపిన సందేశాన్ని షింజో అబే ఇరాన్ ముందుంచారు. అయితే, ట్రంప్కు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవం ఆయన ఉంచుకోలేదని రౌహానీ మండిపడ్డారు. కాగా, అంతర్జాతీయంగా ప్రాధా గల్ఫ్ ఆఫ్ ఓమన్లోని ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతి చర్చల కోసం జపాన్ రంగంలోకి దిగింది. ఇరాన్పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే బాధ్యత జపాన్ తీసుకుంది.
ఆంక్షలున్నప్పటికీ అత్యధికంగా చమురు కొనుగోలు....
ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దని ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ ఆంక్షలు మోపుతామంటూ హెచ్చరిస్తున్నది. అయితే, ఓ పక్క ఆంక్షలు విధిస్తామంటూ అమెరికా బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ గత నెలలో ఇరాన్ నుంచి అత్యధిక బ్యారెళ్ల చమురును కొన్న దేశంగా జపాన్ నిలిచింది. ఇరాన్ పరిస్థితిపై గత నెలలో ట్రంప్తో చర్చలు జరిపిన షింజో అబే... ట్రంప్ పంపిన సందేశాన్ని ఇరాన్ అధినేతకు చేరవేశారు. అయితే ట్రంప్ సందేశంపై ఇరాన్ సుప్రీం ఖమేనీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికే చమురుపై ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం భవిష్యత్తులో రణరంగంగా మారి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఐరోపా, ఆసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఇదేవిధంగా కొనసాగినట్టయితే మధ్యప్రాచ్య దేశాలు చాలా నష్టపోతాయని షింజో అబే హెచ్చరిస్తున్నారు.