Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమానత్వం, హక్కుల సాధనే ధ్యేయం
బెర్న్: స్విట్జర్లాండ్లో మహిళలు ఆందోళన బాటపట్టారు. పనికి సమాన వేతనం ఇవ్వాలని, లింగ వివక్షను రూపుమాపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. 28 ఏండ్ల తర్వాత ఇంత పెద్దఎత్తున స్విస్లో మహిళలు ఉద్యమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. వేతంలో తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. పురుషులతో పోల్చుకుంటే 20శాతం తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని, మరికొన్ని అంశాల్లో తమకు పూర్తి స్వేచ్చను కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనికి ఆదేశ పలువురు మహిళా ప్రముఖులు పూర్తి మద్దతును ప్రకటించారు. ఆందోళన కార్యక్రమాలకు ఫ్లేవియా వాసెర్ఫాలెన్ నేతృత్వం వహించారు. 1991 ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకుంటామని నాటి ఉద్యమకారులు పేర్కొన్నారు. 1991లో ఉద్యమం చెలరేగినప్పుడు 10లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం (1918) నుంచి ఓటు హక్కు కోసం మహిళలు ఆందోళన బాట పట్టారు. దీనికి ప్రతిఫలితంగా 1971లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం వారికి తొలిసారిగా ఓటు హక్కును కల్పించింది. అప్పటి వరకు ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని 1991లో మరోసారి మహిళాలోకం ఆందోళన బాట పట్టింది. వారి డిమాండ్లకు తలొగ్గిన స్విస్ ప్రభుత్వం తొలిసారి వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమనిచింది. వారి ఉద్యమ ఫలితమే నేడు ఆదేశ మంత్రిమండలిలో ఎనిమిది మంది మహిళా మంత్రులకు అవకాశం లభించింది.