Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోస్ ద్వీపం నుంచి తరలింపు
- ఆర్థిక అక్రమ వలసదారులకు అనుమతి నిరాకరణ !
కోస్: అంతర్యుద్ధంతో అతలాకుతలమవు తున్న సిరియా శరణార్థులను ముందుగా తరలిం చాలని గ్రీస్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం వీరందరికీ సంబంధిత పత్రాలను అందజేసి...కోస్ ద్వీపం నుంచి ప్రత్యేక నౌక ద్వారా గ్రీస్కు తీసుకెళ్తున్నారు. ఇరాక్, సిరియా, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ దేశాల నుండి టర్కీ తీర ప్రాంతాలకు, అక్కడ్నుంచీ గ్రీస్కు చెందిన కోస్ ద్వీపానికి వేలాది మంది శరణార్థులు అక్రమంగా తరలివచ్చారు. ఇందులో అత్యధికంగా సిరియా నుంచి వచ్చిన వారే వున్నారు. ప్రస్తుతం వీరంతా కోస్ ద్వీపంలో పలు ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో తలదాచుకున్నారు. సిరియన్లకు మాత్రమే శరణార్థులుగా ఆశ్రయం కల్పించడానకి గ్రీస్ సమ్మతించటంపై ఇతర దేశాల అక్రమ వలసదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా దేశాల నుంచి వచ్చిన వారిని ఆర్థిక అక్రమ వలసదారులుగా గ్రీస్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అక్కడి శరణార్థుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
కోస్లో అక్రమ శరణార్థుల బెడద ఎక్కువ అవటంతో, వారిని అక్కడ్నుంచి తరలించాలని గ్రీస్ భావించి, ఓ భారీ నౌకను శుక్రవారం ద్వీపానికి పంపింది. ఈ క్రమంలో ముందుగా ఎవరిని నౌకలోకి అనుమతించాలన్నదానిపై గ్రీస్ అధికారులు ఒక రోజంతా సమాలోచనలు చేసి, సిరియా శరణార్థులను తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనిపై ఇతర దేశాల శరణార్థుల నుంచి నిరసన వ్యక్తమైంది. నౌకలోకి శరణార్థులను అనుమతించే ముందు అధికారులు కొన్ని నిబంధనల్ని పాటించారు. రాజకీయ అశాంతి, అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న సిరియా శరణార్థులకు ముందుగా ప్రాధాన్యాత ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది కాస్తా మిగతా దేశ శరణార్థులకు ఆగ్రహం తెప్పించింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం వారిని శరణార్థులుగా గుర్తిస్తున్నామని గ్రీస్ అధికారులు తెలిపారు. ఇతరులను ఆర్థిక వలసదారులుగా భావిస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో 2,500 సిరియా శరణార్థులకు సంబంధిత పత్రాలను రూపొందించి నౌకలోకి అనుమతించారు. గ్రీస్కు వెళ్లే అవకాశం రాని వారు ఇతర గ్రూప్లతో ఘర్షణకు దిగుతున్నారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితికి కారణమవుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో మరిన్ని భద్రతా దళాల్ని అక్కడికి గ్రీస్ పంపింది.