Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరిజోనా ఎడారిలో ఘటన
ఓవాషింగ్టన్ : వడదెబ్బతో ఆరేండ్ల భారతీయ చిన్నారి మృతి చెందిన సంఘటన అరిజోనా ఎడారిలో చోటుచేసుకుంది. యూఎస్ సరిహద్దు గస్తీ బలగాలు వెల్లడించిన వివరాల ప్రకారం...గురుప్రీత్ కౌర్(6) అనే బాలిక తల్లి మెక్సికో సరిహద్దు ద్వారా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయితే, మెక్సికో సరిహద్దు ద్వారా ప్రవేశించే విదేశీయుల ప్రవేశాలను అడ్డుకునేందుకు అమెరికా గస్తీ బలగాలు పహారా కాస్తున్నాయి. అందుకే, సరిహద్దు వరకు చేరుకునేందుకు గురుప్రీత్ కౌర్ తల్లి కొంతమంది సహకారం తీసుకుంది. తల్లీకూతుర్లతో పాటు మరో ఐదుగురిని మెక్సికో సరిహద్దులోని ల్యూక్విల్లే ప్రాంతంలో వదిలిపెట్టి స్మగ్లర్లు వెళ్లిపోయారు. ఎండ తీవ్రత 42 డిగ్రీల సెల్సియస్ ఉండటంతో తల్లీకూతుర్లిద్దరూ నీటి కోసం వెతకడం ప్రారంభించారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత బాలిక తల్లి కూతుర్ని మిగతావారివద్ద వదిలి.. మరో మహిళతో కలిసి నీటి కోసం వెదుక్కుంటూ ముందుకు వెళ్లింది. అలా నీటి కోసం వెళ్లిన వారు వెనక్కి తిరిగి రాలేదు. వడ దెబ్బ కొట్టడంతో వారు కూడా స్ప హ తప్పి పడిపోయారు. మరుసటి రోజు సరిహద్దు గస్తీ బలగాలు వారి పాద ముద్రల ఆధారంగా నడుచుకుంటూ వెళ్లగా ఓ చోట ఇద్దరు మహిళలు పడి పోయి ఉండటం గమనించాడు. వారికి ప్రథమ చికిత్స చేసిన అనంతరం వివరాలు సేకరించాడు. ఇద్దరు మహిళలకు ఇంగ్లీష్ రాకపోవడంతో వారితో మాట్లడటం చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో గురుప్రీత్ సైగల ద్వారా తన కూతురు గురించి అధికారులకు తెలియజేసింది. తాము నీటి కోసం వెదుకుతూ వచ్చామని.. తన కూతురు వేరే చోట ఉందని తెలియజేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం పోలీసులు గాలింపు చేపట్టగా.. ఓ మైలు దూరంలో వారికి గురుప్రీత్ కౌర్ మృత దేహం కనిపించింది.
కొన్ని గంటల పాటు నీరు లేక తీవ్రమైన ఎండలో ఉండటంతో గురుప్రీత్ మృతి చెందింది. బాలిక మృతికి స్మగ్లర్లే కారణమని అమెరికా సరిహద్దు భద్రత అధికారులు ఆరోపించారు. అమెరికాలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశంగా ల్యూక్విలే అరిజోనా ప్రసిద్ధికెక్కింది. ఇది పూర్తిగా ఎడారి ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంత వేడి వాతావరణం మూలానే సదరు బాలిక మృతి చెందిందని వైద్యులు భావిస్తున్నారు. ప్రైమా కౌంటీ ఆఫ్ మెడికల్ ఎగ్జామినర్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం...ఈ ఏడాది మే30నాటికి అరిజోనా ఎడారి ప్రాంతంలో 58 మంది వలసదారులు మృతి చెందారు. గతేడాది ఈ ప్రాంతంలో 127 మంది మృతిచెందారు. మెక్సికో సరిహద్దులో వలసదారుల మృతికి యూఎస్ గస్తీ భద్రతా బలగాలే కారణమని హక్కుల సంఘం నేత జువాంటియా మోలినా తెలిపారు. వలసదారుల పట్ల గస్తీ భద్రతా బలగాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.